ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు అమలు చేస్తాం: భట్టి విక్రమార్క

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలను ఇవాళ అమలు చేసింది.

Update: 2024-02-27 11:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలను ఇవాళ అమలు చేసింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీములను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ స్కీము మహిళలకు చాలా ఊరట ఇస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 40 లక్షల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ పథకంలో లబ్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. లోపాలు గుర్తించి ఈ పథకంలో మార్పులు చేసుకుంటూ వెళ్తామని చెప్పారు. త్వరలో నేరుగా లబ్ధిదారులు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పొందేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోని పేదలకు ఎక్కువ ఉపయోగం కలిగేలా ఆరు గ్యారంటీలను రూపొందించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వైపు దేశం మొత్తం చూస్తోందని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని అసహనం వ్యక్తం చేశారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని అన్నారు. ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేసి తీరుతామని.. అందుకోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు. మన దేశంలో కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పెరిగిన ధరల నుంచి సామాన్యులకు, మహిళలకు ఊరట ఇచ్చేందుకు గృహజ్యోతి పథకాన్ని ప్రకటించినట్లు తెలిపారు.

Tags:    

Similar News