ప్రధాని పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి: CPI

రానున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను చక్రబంధంలో బంధించే కుట్రలో భాగంగానే అకస్మాత్తుగా రూ.2 వేల నోట్లు రద్దు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.

Update: 2023-05-20 12:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను చక్రబంధంలో బంధించే కుట్రలో భాగంగానే అకస్మాత్తుగా రూ.2 వేల నోట్లు రద్దు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. గతంలో యూపీ ఎన్నికల కంటే ముందు కూడా అప్పటి పాలక పార్టీ ఎస్‌పీ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో బలహీన పరిచే ఉద్దేశంతో, మరికొన్ని కారణాలతో అప్పుడు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చేయడం జరిగిందని, అదే తరహాలో ఇప్పుడు నిర్ణయం చేశారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా 2 వేల రూపాయల నోట్ల రద్దు నిర్ణయం గతంలో మోడీ ప్రభుత్వ చేసిన ఘోర తప్పిదాలకు నిదర్శనమని, రూ.2 వేల నోట్ల రద్దు వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కర్నాటకలో బీజేపీ ఘోర ఓటమి నుంచి ప్రజల దృష్టి మరలచడానికే అకస్మాతుగా ఆర్‌బీఐ నుంచి ఈ నిర్ణయాన్ని ప్రకటించారని ఆయన విమర్శించారు.

ప్రతీ అంశాన్ని ఏదోరకంగా ప్రచారం కోసం వాడుకునే మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. గతంలో పెద్దనోట్లు రద్దు చేసినప్పుడు నల్లధనం బయటికి వస్తున్నదని, ఉగ్రవాదం, అవినీతి అంతమవుతుందని మోడీ బీరాలు పలికారని ఆయన గుర్తుచేశారు. ఆ లక్ష్యాలు నెరవేరక పోగా నాడు పెద్దనోట్ల మార్పిడి కోసం దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారని, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని, కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. నాటి పెద్దనోట్ల రద్దు దుష్పరిణామాలకు అవశేషంగా మిగిలిన రూ. 2 వేల నోట్లను రద్దు చేయడం ద్వారా కేంద్రం వైఫల్యాన్ని ఎండగట్టిన్నట్లయిందన్నారు. ఆనాడు పెద్దనోట్ల రద్దు చేసిన పాపం దేశాన్ని ఇప్పటికి పట్టిపీడిస్తున్నదని, కోట్లాది మంది జీవితాలు ఆగమయ్యాయని, తన అసమర్థ పాలన వలనే దేశాభివృద్ధికి, ప్రజావళికి జరిగిన నష్టానికి బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Also Read..

CPI: కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: నారాయణ 

Tags:    

Similar News