కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరూ తోడుదొంగలే: సీఎం ధామి ఫైర్

రాష్ట్రంలో కారు.. కార్ఖానాలోకి పోయిందని, చేతి పని అయిపోయిందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘాటు విమర్శలు చేశారు.

Update: 2024-05-06 15:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కారు.. కార్ఖానాలోకి పోయిందని, చేతి పని అయిపోయిందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘాటు విమర్శలు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన యువ సమ్మేళనంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాము ఉత్తరాఖండ్‌లో ల్యాండ్ జిహాద్‌పై కఠినంగా చర్యలు తీసుకున్నామని, 5 వేల ఎకరాలకు పైగా స్థలాన్ని బలవంతపు ఆక్రమణల నుంచి కాపాడుకున్నట్లు వివరించారు. తాను బతికున్నన్ని రోజులు రిజర్వేషన్ల వ్యవస్థను ఎవరూ టచ్ చేయలేరని స్వయంగా మోడీ చెప్పారని, అయినా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని విమర్శలు చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలేనని, కాళేశ్వరం అవినీతిపై అసలు విచారణ జరుగుతోందా..? అని పుష్కర్ సింగ్ ధామి అనుమానం వ్యక్తంచేశారు. మహిళలకు రూ.2500, నిరుద్యోగ భృతి కింద రూ.4వేలు ఇస్తామన్నారని, మరి ఇచ్చారా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ వీటిపై ఆలోచన చేయాలని ఆయన కోరారు. రాజకీయాల్లో కిషన్ రెడ్డి వంటి మంచి వ్యక్తి దొరకడని, అందుకే ఆయన్ను గెలిపించి మోడీకి మద్దతు ఇవ్వాలని కోరారు. తాను ఒక్కడిని ఓటింగ్‌కు వెళ్లకుంటే ఏమవుతుందనే అలసత్వం మాత్రం ఓటర్లు వహించొద్దని పుష్కర్ సింగ్ ధామి కోరారు.

Tags:    

Similar News