ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ కీలక వ్యాఖ్యలు

ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు.

Update: 2024-05-23 07:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గతంలో ఏప్రిల్ తొలి వారం తర్వాతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచారన్నారు. ఈ ఏడాది మార్చి 25 లోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 7,241 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే 83 శాతం ధాన్యానికి చెల్లింపులు జరిగాయన్నారు. ధాన్యం తీసుకువస్తున్న రైతులతో తాను నేరుగా మాట్లాడానన్నారు.

ధాన్యం అమ్మిన 3 రోజుల్లోనే డబ్బులు పడ్డాయని రైతులు చెబుతున్నారన్నారు. దాదాపు 80 కొనుగోలు కేంద్రాలను తాను పరిశీలించానని తెలిపారు. రైతులకు ఫోన్ చేసి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగాను అన్నారు. అంతా బాగానే ఉందని చాలా మంది రైతులు సంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఒకట్రెండు చోట్ల ఏమైనా పొరపాట్లు జరిగితే జరిగి ఉండొచ్చని.. అవగాహన లేని సిబ్బంది వల్ల కొన్ని చోట్ల పొరపాట్లు జరిగాయన్నారు. తొలి త్రైమాసికంలోనే పౌరసరఫరాల శాఖలో రూ.6వేల కోట్ల అప్పు తీర్చామన్నారు. రైతులను నిరుత్సాహ పరిచే వార్తలు రాయొద్దని రిక్వెస్ట్ చేశారు.

Similar News