కేరళ CM విజయన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కమ్యూనిస్టు రూపంలో కనిపించే కమ్యూనిలిస్టు అని, ఆయన ప్రధాని మోడీతో రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు.
దిశ, తెలంగాణ బ్యూరో : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కమ్యూనిస్టు రూపంలో కనిపించే కమ్యూనిలిస్టు అని, ఆయన ప్రధాని మోడీతో రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. కేరళలోని వయనాడ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం రైతుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా పై కామెంట్లు చేశారు. పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులు అవినీతిలో మునిగిపోయారని, బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆయనపై ఈడీ, ఇన్కమ్ టాక్స్ కేసులున్నా ఆయనపై మోడీ చర్యలు తీసుకోవడం లేదని, వారిద్దరి మధ్య రహస్య ఒప్పందమే అందుకు కారణమన్నారు. మతతత్వ బీజేపీతో కలిసి పని చేస్తున్న ఆయన వయనాడ్లో ఆ పార్టీ అభ్యర్థి సురేంద్రన్కి మద్దతు ఇస్తున్నారని, సొంత పార్టీ సీపీఎంతో పాటు కేరళ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకోడానికి, హక్కులను సాధించుకోడానికి, చట్టబద్ధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయడానికి బదులుగా రాజీ పడుతున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు పోరాడుతూ ఉన్నాయని, విజయన్ మాత్రం దానికి విరుద్ధంగా వ్యవసరిస్తున్నారని అన్నారు. పైకి సీపీఎం ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కనిపిస్తున్నా కార్యాచరణ మాత్రం కమ్యూనలిస్టు తరహాలో ఉందన్నారు. ఈడీ, ఐటీ కేసులు ఉన్నన్ని రోజులు సీపీఎం కోసం విజయన్ పనిచేయరన్నారు. మణిపూర్లో వందలాది మంది క్రిస్టియన్లు బీజేపీ గుండాల చేతిలో చనిపోయినా ప్రధాని, అమిత్ షా అక్కడ పర్యటించలేదని, కానీ రాహుల్ గాంధీ స్వయంగా అక్కడికి వెళ్ళి బాధితులను ఓదార్చారని గుర్తుచేశారు.
రాహుల్ ప్రధాని కావడం ఖాయం
“రాసిపెట్టుకోండి... జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం... దేశంలో రెండు పరివార్ల మధ్య పోరాటం జరుగుతున్నది... మోడీ పరివార్లో ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్, అదానీ, అంబానీ ఉన్నారని, ఇండియా పరివార్లో ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, వాయనాడ్ కుటుంబ సభ్యులున్నారని అన్నారు. ఇందిరా, రాజీవ్లు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, సోనియా, రాహుల్గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని అన్నారు. వాయనాడ్ ప్రజలు రాహుల్గాంధీ వైపు ఉన్నారని వ్యాఖ్యానించారు. రాహుల్గాంధీపై వయనాడ్ ప్రజల అభిమానాన్ని చూద్దామనే తాను తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చానని అన్నారు. తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా రాహుల్గాంధీని కోరామని, కానీ ఆయన మాత్రం వయనాడ్వైపే మొగ్గు చూపారని గుర్తుచేశారు.
గత ఎన్నికల్లో వాయనాడ్లో రాహుల్గాంధీకి 65% ఓట్లు వచ్చాయని, ఈసారి 75% రావాలన్నారు. మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, వారణాసి వర్సెస్ వయనాడ్ మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతున్నదన్నారు. ఇక్కడి ప్రజలు ఓటు వేయబోయేది కేవలం ఎంపీ అభ్యర్థికి మాత్రమే కాదని, దేశానికి కాబోయే ప్రధానికి అని నొక్కిచెప్పారు. కేరళ ప్రజలు కష్టపడే మనస్తత్వం కలిగిన వారని, తెలివైన వారని, అందుకే వారి శ్రమతో దుబాయ్ లాంటి దేశాలు అభివృద్ధి చెందాయని, కానీ కేరళ మాత్రం అభివృద్ధి కాలేదన్నారు.