మంచిర్యాలలో దొంగల ముఠా అరెస్టు
మంచిర్యాల జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ వెల్లడించారు.
దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 11.72 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మంచిర్యాల, హాజీపూర్, సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులు పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి రాత్రిపూట, ఇనుప రాడ్లతో ఇంటి తాళలను పగులగొట్టి దొంగతనాలు చేశారు. దొంగసొత్తును కరీంనగర్ వెళ్ళి అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం ఒప్పుకున్నారని తెలిపారు.
ఈ ఘటనలో పాగిడి కార్తీక్ (సీసీసీ), తాటికొండ స్వామి చరణ్ (గాంధీ నగర్, మంచిర్యాల), పుప్పాల రాహుల్ (లక్ష్మిపురం, బెల్లంపల్లి), గన్నారం మధుకర్ (సుందరయ్య కాలనీ, నస్పూర్), కుర్సింగ ఈశ్వర్( కోమటిచేను) మడావి రాము (తిర్యాణి) వెడ్మ ప్రవీణ్ (కన్నెపల్లి) లను అరెస్టు చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 9. 22 లక్షల విలువ చేసే బంగారం ఆభరణాలు, రూ. 60,000 విలువైన వెండి ఆభరణాలు, ఒక బైక్, ఎల్ఈడీ టీవీ, హోమ్ థియేటర్, గిటార్ మొత్తం 11.72 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.