మలేషియా మాస్టర్స్‌లో అష్మిత సంచలనం.. వరల్డ్ నం.10కు షాక్

మలేషియా మాస్టర్స్‌ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో యువ క్రీడాకారిణి అష్మిత చాలిహా సంచలన ప్రదర్శన చేసింది.

Update: 2024-05-23 14:06 GMT

దిశ, స్పోర్ట్స్ : కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా మాస్టర్స్‌ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో యువ క్రీడాకారిణి అష్మిత చాలిహా సంచలన ప్రదర్శన చేసింది. ఉమెన్స్ సింగిల్స్‌లో వరల్డ్ నం.53 ర్యాంక్‌లో ఉన్న ఆమె రెండో రౌండ్‌లో వరల్డ్ నం.10 క్రీడాకారిణిని మట్టికరిపించింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో అష్మిత 21-19, 16-21, 21-12 తేడాతో అమెరికా షట్లర్ బీవెన్ జాంగ్‌పై విజయం సాధించింది. 43 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో శుభారంభం అష్మితదే. నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి గేమ్‌ను ఆమె పోరాడి మరి దక్కించుకుంది. అయితే, రెండో గేమ్‌ను ప్రత్యర్థి నెగ్గడంతో అష్మిత జోరుకు బ్రేక్ పడేలా కనిపించింది. కానీ, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆమె చెలరేగి ఆడింది. తన కంటే మెరుగైన ర్యాంకర్‌ను కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం చేస్తూ అష్మిత మూడో గేమ్‌ను నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకుంది.

మరోవైపు, స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రెండో రౌండ్‌లో సింధు 21-13, 12-21, 21-14 తేడాతో సౌత్ కొరియా క్రీడాకారిణి సిమ్ యు జిన్‌ను చిత్తు చేసింది. 59 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో మూడో గేమ్‌లో సింధు విజయం ఖాయమైంది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో టాప్ సీడ్ హాన్ యూ(చైనా)తో సింధు తలపడగా.. చైనాకే చెందిన జాంగ్ యి మాన్‌‌ను అష్మిత ఎదుర్కోనుంది. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ నిరాశపరిచాడు. రెండో రౌండ్‌లో కిరణ్ 13-21, 18-21 తేడాతో లీ జీ జియా(మలేషియా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. అలాగే, ఉమెన్స్ డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ జోడీకి నిరాశే ఎదురైంది. రెండో రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన యు చియెన్ హుయ్-సుంగ్ షుయో యున్ జంట చేతిలో 18-21, 22-20, 14-21 తేడాతో పోరాడి ఓడింది. పురుషుల డబుల్స్‌లో సాయిప్రతీక్-కృష్ణ ప్రసాద్ జంట కూడా రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టింది. 

Tags:    

Similar News