'మీతో ఆడేది లేదు'.. పీసీబీ ఆఫర్‌ని తిరస్కరించిన బీసీసీఐ

ఇండియా-పాక్ మధ్య టెస్ట్ సిరీస్ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్టే వచ్చి కనమరుగైంది.

Update: 2023-05-18 10:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా-పాక్ మధ్య టెస్ట్ సిరీస్ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్టే వచ్చి కనమరుగైంది. టెస్ట్‌ సిరీస్‌ నిర్వహించే పీసీబీ (పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు) ప్రతిపాదనను బీసీసీఐ కొట్టిపారేసింది. ఆసియా కప్ 2023 టోర్నీ గురించి రచ్చ జరుగుతున్న సమయంలో ఇండియా- పాకిస్తాన్ మధ్య తటస్థ వేదికపై టెస్టు సిరీస్ నిర్వహిస్తే బాగుంటుందని పీసీబీ ఛైర్మెన్ నజం సేథీ, బీసీసీఐకి ఆఫర్ ఇచ్చాడు. "ఇండియా - పాక్ మధ్య టెస్టు సిరీస్ జరిగితే సుదీర్ఘ ఫార్మాట్‌కి మళ్లీ క్రేజ్ వస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లేదా సౌతాఫ్రికాలో టెస్టు మ్యాచులు ఆడితే బాగుంటుంది. ఇండియా- పాక్ ఫ్యాన్స్‌తో నిండిపోతాయి.." అంటూ కామెంట్ చేశాడు పీసీబీ ఛైర్మెన్ నజం సేథీ.

అయితే పీసీబీ ఆఫర్‌ను బీసీసీఐ తిరస్కరించింది. ‘పాకిస్తాన్‌తో రాబోయే రోజుల్లో టెస్టు సిరీస్ ఆడే ఆలోచన కూడా మాకు లేదు. ఎలాంటి సిరీస్ ఆడేందుకు కూడా టీమ్ ఇండియా సిద్ధంగా లేదు..’ అంటూ ఓ బీసీసీఐ అధికారి మీడియాకి తెలిపారు. ఆసియా కప్ 2023 టోర్నీని పాకిస్తాన్‌లో నిర్వహించాలని గట్టిగా ప్రయత్నించింది పీసీబీ. ఆసియా కప్‌-2023 వేదిక విషయంలో ప్రస్తుతం భారత్‌-పాక్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదన్న విషయం తెలిసిందే. భద్రతా కారణాల రిత్యా టీమ్ ఇండియా పాక్‌లో అడుగుపెట్టదని బీసీసీఐ తెగేసి చెప్పింది.. ఈ నేపథ్యంలో దీనికి కౌంటర్‌గా పాక్‌ కూడా వన్డే వరల్డ్‌కప్‌ కోసం భారత్‌లో అడుగుపెట్టదని స్పష్టం చేసింది. అయితే బీసీసీఐ, పాక్‌లో అడుగుపెట్టేందుకు నిరాకరించడంతో తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News