మలేషియా మాస్టర్స్‌ టోర్నీలో ఫైనల్‌కు సింధు.. రెండేళ్ల తర్వాత టైటిల్ పోరుకు

Update: 2024-05-25 16:32 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టైటిల్ నిరీక్షణకు తెరదించడానికి అడుగు దూరంలో నిలిచింది. కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో సింధు 13-21, 21-16, 21-12 తేడాతో థాయిలాండ్ క్రీడాకారిణి బుసానన్ ఒంగ్‌బుమ్రుంగ్‌ఫాన్‌పై విజయం సాధించింది.

గంటా 28 నిమిషాలపాటు ఇరువురి మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో మొదట సింధుకు శుభారంభం దక్కలేదు. ప్రత్యర్థికి తొలి గేమ్‌ను సమర్పించుకుంది. ఆ తర్వాత సింధు పుంజుకున్న తీరు అద్భుతం. వరుసగా రెండు గేమ్‌లను నెగ్గింది. ప్రత్యర్థి దూకుడును అడ్డుకుంటూ తనదైన షాట్లతో చెలరేగింది. రెండో గేమ్‌లో థాయిలాండ్ షట్లర్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నా.. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం పూర్తిగా సింధు హవానే కొనసాగింది.

ఈ సీజన్‌లో టైటిల్ పోరు‌కు చేరుకోవడం సింధుకు ఇదే తొలిసారి. అంతేకాకుండా, దాదాపు రెండేళ్లుగా ఆమె టైటిల్ కూడా గెలవలేదు. చివరిసారిగా 2022లో సింగపూర్ ఓపెన్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో టైటిల్ నిరీక్షణకు తెరదించాలని సింధు భావిస్తోంది. ఆదివారం జరిగే ఫైనల్‌లో 2వ సీడ్, వాంగ్ జీ యి(చైనా)తో సింధు తాడోపేడో తేల్చుకోనుంది. 

Tags:    

Similar News