ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు
టీ20 సిరీస్లో పాకిస్తాన్కు ఆతిథ్య ఇంగ్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది.
దిశ, స్పోర్ట్స్ : టీ20 సిరీస్లో పాకిస్తాన్కు ఆతిథ్య ఇంగ్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. తొలి టీ20 వర్షార్పణమవ్వగా.. బర్మింగ్హామ్ వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో పాక్ను 23 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 183/7 స్కోరు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్(84) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లను చితకబాదిన అతను ఎడాపెడా బౌండరీలు దంచాడు. అతనికితోడు విల్ జాక్స్(37), బెయిర్ స్టో(21) విలువైన పరుగులు జోడించారు. అయితే, డెత్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 200 లోపే పరిమితమైంది. అనంతరం ఛేదనకు దిగిన పాక్ జట్టు ఇంగ్లాండ్ బౌలింగ్లో తేలిపోయింది. 19.2 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. ఫకర్ జమాన్(45) టాప్ స్కోరర్. రీస్ టోప్లే(3/41), మొయిన్ అలీ(2/26), జోఫ్రా ఆర్చర్(2/28) పాక్ పతనాన్ని శాసించారు. ఈ విజయంతో నాలుగు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మంగళవారం మూడో టీ20 జరగనుంది.