దేశ ప్రజలందరికీ టీకా : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ కరోనా టీకాను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. టీకా పంపిణీలో భద్రత, వేగం ప్రధానమని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజీలు సహా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. దేశ ప్రజలకు ఇచ్చే టీకా ఏదైనాసరే భద్రతాపరంగా శాస్త్రీయంగా ధ్రువీకరించినదే అవుతుందన్నారు. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా 50వేలకు లోపు కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కానీ, న్యూఢిల్లీ సహా ఎనిమిది రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభిస్తున్నది. ఈ […]

Update: 2020-11-24 08:52 GMT

న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ కరోనా టీకాను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. టీకా పంపిణీలో భద్రత, వేగం ప్రధానమని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజీలు సహా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. దేశ ప్రజలకు ఇచ్చే టీకా ఏదైనాసరే భద్రతాపరంగా శాస్త్రీయంగా ధ్రువీకరించినదే అవుతుందన్నారు. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా 50వేలకు లోపు కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కానీ, న్యూఢిల్లీ సహా ఎనిమిది రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ‌సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కరోనా తీవ్రతపై చర్చించడంతోపాటు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పంపిణీ చేయడంపై చర్చించారు. కరోనా నిర్ధారిత పరీక్షల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని తెలిపారు. కరోనా విషయంలో ఎలాంటి అలసత్వం పనికిరాదని ఉద్బోధ చేశారు. పాజిటివ్ రేటు 5 శాతం లోపు, మరణాల రేటు 1 శాతం లోపునకు తీసుకురావాలని సూచించారు.

వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షించడం, నిర్ధారణ చేసుకోవడం, కాంటాక్ట్ ట్రేసింగ్, సమాచార సేకరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. టీకా అందుబాటులోకి వస్తే ఎవరికి మొదట ఇవ్వాలనే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టత ఇచ్చారు. ప్రాణాలకు తెగించి ముందుండి మహమ్మారితో పోరుడుతున్న వైద్య సిబ్బందికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. రెండో దశలో పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, మూడో దశలో 50ఏండ్లకు వయస్సు పైబడిన వారికి, నాలుగో దశలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి టీకా ఇవ్వనున్నట్టు చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ‌పై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. వ్యాక్సిన్ విషయమై ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండా ‘అనవసర రాజీయాలు చేస్తున్నారు’ అని ఆరోపించారు. ‘వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మనం నిర్దేశించలేం. అది మన చేతుల్లో కూడా లేదు. వ్యాక్సిన్ తయారీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న శాస్త్రేవేత్తల చేతుల్లో ఉంది’ అని ప్రధాని అన్నారు. ఈ విషయమై కొంత మంది రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయాల చేయడం దేనిని కూడా ఆపలేరు అని పేర్కొన్నారు.

దేశ రాజధానిలో కరోనా కేసులు విపరీతంగా నమోదు కావడానికి ప్రధాన కారణం వాయు కాలుష్యమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలపెట్టడాన్ని నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. రాష్ట్రంలో కరోనా విజృంభించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని, కానీ, ప్రధాన కారణం మాత్రం వాయు కాలుష్యమేనని పేర్కొన్నారు. రాజస్తాన్ రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులను నిలిపివేశామని, వాటి ఫలితాలు సరిగ్గా ఉండటం లేదని సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. అన్ని టెస్టులు ఆర్‌టీ-పీసీఆర్ ద్వారానే నిర్వహిస్తున్నామని, వీటి సంఖ్య రోజుకు 30వేలకు పైగా ఉన్నాయని తెలిపారు. మహమ్మారి వ్యాప్తి నివారణలో భాగంగా బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించామని, మాస్క్ పెట్టుకోవడంపై చట్టం చేశామని, రాత్రుల్లో కర్ఫ్యూ, ఒక దగ్గర గుమిగూడటాన్ని నిషేధించామని చెప్పారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉన్నదని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. కొన్ని రాష్ట్రాలకు రావాల్సిన గూడ్స్, సర్వీస్ టాక్స్(జీఎస్టీ) బకాయిలపై సమావేశంలో ఆమె ప్రస్తావించారు. మరోవైపు కాంటాక్ట్ ట్రేసింగ్ గురించి హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతుండగా ప్రధాని మోడీ అడ్డుకుని ‘మనోహర్ జీ’ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటో తెలుపండి అని సూచించారు.

Tags:    

Similar News