గవర్నర్ రాగానే మంత్రులు మాయం: BJP MP

Update: 2022-03-01 06:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న సీఎం కేసీఆర్, ఆల్రెడీ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేయడం ప్రారంభించారని విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ కొత్త సెషన్స్‌ను గవర్నర్ ప్రసంగించిన తర్వాతనే ప్రారంభం కావాలి, కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా గవర్నర్ వ్యవస్థనే కించపరుస్తూ గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యాడని మండిపడ్డారు. ఇది కేసీఆర్ నిరంకుశ, నియంత పాలనకు అద్దం పడుతుందన్నారు. గవర్నర్ ఒక మహిళ అయినందువల్లనే ఆమె ప్రసంగం లేకుండా చేశారని స్పష్టంగా తెలుస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మహిళలంటే కేసీఆర్‌కు చిన్నచూపని తెలిపారు. అవకాశం ఉన్నప్పుడల్లా మహిళలను కేసీఆర్ అవమానపరుస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. మొదటిసారి రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడ్డప్పుడు ఆ మంత్రి మండలిలో మహిళలకు అవకాశమే ఇవ్వలేదని తెలిపారు. చివరికి మొన్న మేడారం జాతరలో గవర్నర్ వెళ్లినప్పుడు ప్రోటోకాల్ పాటించనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రథమ మహిళ ఒక దేవస్థానికి వెళ్లినప్పుడు అప్పటివరకు అక్కడే ఉన్న మంత్రులు సడెన్‌గా మాయమయ్యారని ఎద్దేవా చేశారు. మంత్రులెవరూ గవర్నర్‌ను ఆహ్వానించలేదని అన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఆయన సొంత రాజ్యం అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News