ప్రియురాలితో పారిపోయిన కోడుకు.. తల్లికి ఆ శిక్ష వేసిన గ్రామస్తులు.. వీడియో వైరల్..

నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు, పెద్దలని ఎదిరించి కాదు ఒప్పించి ఒకటవుతుంది, అనే మాటకు కొంతమంది ప్రేమికులు నిదర్శనంగా నిలుస్తుంటే.. ఎంతోమంది ప్రేమ పేరుతో ఇంటి పరువును బజార్లో పెడుతున్నారు.

Update: 2024-05-04 07:19 GMT

దిశ వెబ్ డెస్క్: నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు, పెద్దలని ఎదిరించి కాదు ఒప్పించి ఒకటవుతుంది, అనే మాటకు కొంతమంది ప్రేమికులు నిదర్శనంగా నిలుస్తుంటే.. ఎంతోమంది ప్రేమ పేరుతో ఇంటి పరువును బజార్లో పెడుతున్నారు. పిల్లలు చేసిన తప్పుకి వాళ్ళను కన్న తల్లిదండ్రులు శిక్ష అనుభవిస్తున్నారు. యువతలో చాలామంది ప్రేమ పేరుతో సమస్యల్లో పడుతున్నారు. లేదా కన్న వాళ్లకు సమస్యలను తెచ్చి పెడుతున్నారు.

తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని హవేరీ జిల్లాలో అరెమల్లాపుర గ్రామానికి చెందిన మంజునాథ్, పూజ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారిరువురూ పెళ్లితో ఒకటి కావాలని అనుకున్నారు. ఈ విషయాన్ని ఇరువురు వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. కాని ఇరు కుటుంబాల సభ్యులు ప్రేమ పెళ్లికి ససేమిరా ఒప్పుకోము అని తేల్చి చెప్పారు.

దీనితో ఆ ప్రేమ జంట అనాలోచిత నిర్ణయం తీసుకుంది. తమ కుటుంబాల పరువును తుంగలో తొక్కి గత నెల 29న ఇళ్ళ నుంచి పారిపోయారు. దీనితో అమ్మాయి కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. ఆ అమ్మాయిని తీసుకెళ్లిన అబ్బాయి ఇంటికి వెళ్ళారు. మానవత్వాన్ని మరిచి ఇంట్లో ఉన్న అబ్బాయి తల్లి హనుమవ్వ కోమ్‌ను ఇంటి నుంచి బయటకు ఈడ్చుకు వచ్చారు. 

ఆమెను విద్యుత్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకుని యువకుడి తల్లి హనుమవ్వను విడిపించారు. అనంతరం బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి కుటుంబ సభ్యుల్లో ముగ్గురిని పోలీస్ అరెస్ట్ చేశారు.

కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ వీడియోని మీరు కూడా ఒకసారి చూసేయండి. 

Similar News