ముస్లింల ఓట్లు కావాలి కానీ..అభ్యర్థులు వద్దా: సొంత పార్టీపైనే కాంగ్రెస్ నేత అసంతృప్తి

లోక్ సభ ఎన్నికల వేల మహారాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్ నేత ముహమ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ సొంత పార్టీపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-04-27 05:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేల మహారాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్ నేత ముహమ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ సొంత పార్టీపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ కేటాయించక పోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి లోక్‌సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయబోనని, ప్రచార బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

‘రాష్ట్రంలో ఒక్క చోటైనా ముస్లిం అభ్యర్థిని ప్రకటిస్తారని అనేక ముస్లిం సంస్థలు, నాయకులు, కాంగ్రెస్‌లోని మైనారిటీ కార్యకర్తలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ దురదృష్టవ శాత్తు అవకాశం దక్కక పోవడం బాధాకరం’ అని తెలిపారు. కాంగ్రెస్‌కు ముస్లిం ఓట్లు కావాలి కానీ అభ్యర్థులు వద్దా అని ప్రశ్నించారు. ముస్లిం అభ్యర్థిని ఎందుకు పోటీకి దింపలేదని ప్రజలు అడిగితే దీనికి ఏం సమాధానం చెప్పాలని తెలిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీకి రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కాలని తాను కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు గానూ ఎంవీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న కాంగ్రెస్‌ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే రాష్ట్రంలోని మొత్తం స్థానాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఎన్నికల బరిలో నిలపలేదు. ఈ నేపథ్యంలోనే నసీమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబై నార్త్ సెంట్రల్ నుంచి నసీమ్ టికెట్ ఆశించారు. అయితే పార్టీ అక్కడి నుంచి వర్షా గైక్వాడ్‌ను ఎంపిక చేసింది. 

Tags:    

Similar News