ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలకు హాజరైన ఉపరాష్ట్రపతి

ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి అంత్యక్రియలకు హాజరయ్యారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్.

Update: 2024-05-22 17:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి అంత్యక్రియలకు హాజరయ్యారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్. ఇరాన్ అధ్యక్షుడి అధికారిక అంత్యక్రియల్లో భారత ప్రతినిధి బృందానికి ఉపరాష్ట్రపతి నాయకత్వం వహించారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ, విదేశాంగ మంత్రి హెస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్లకు నివాళులర్పించారు. ఇరువురు నేతల మరణంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్ మోఖ్బర్‌ని కలుసుకుని సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఇకపోతే, రయీసీ మరణానికి గౌరవ సూచకంగా మంగళవారం భారత్ లో జాతీయ సంతాప దినం పాటించారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పిస్తున్న ఫొటోను ఉపరాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ లో పోస్టు చేసింది. అంత్యక్రియలకు హాజరైన ఉపరాష్ట్రపతికి అక్కడి అధికారులు టెహ్రాన్‌లో స్వాగతం పలికారు. రయీసీ మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లి సంతాపం తెలిపారు విదేశాంగమంత్రి జైశంకర్.

ఇరాన్ అధ్యక్షుడు, ఇరాన్ విదేశాంగ మంత్రి సహా పలువురు అధికారులు హెలికాప్టర్ ప్రమాదంలో సోమవారం మరణించారు. పొగమంచు వల్ల హెలికాప్టర్ మిస్ అయిన కొన్ని గంటల తర్వాతే మరణించినట్లు తెలిపింది ఇరాన్ స్టేట్ మీడియా.

Similar News