పాకిస్థాన్ భాష మాట్లాడే వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి: మహారాష్ట్ర సీఎం షిండే

నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్‌ నేత వాడెట్టివార్, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీలు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే స్పందించారు.

Update: 2024-05-08 05:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్‌ నేత వాడెట్టివార్, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీలు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే స్పందించారు. భారత్‌లో ఉంటూ పాకిస్థాన్‌ భాష మాట్లాడే వారిపై దేశద్రోహం కేసు నమోదు చేసి జైలుకు పంపాలని తెలిపారు. ప్రధాని మోడీ హయాంలో దేశమంతా వ్యాపించిన దేశ భక్తిని చూసి వారు సహించలేకపోతున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. ‘కొంతమంది పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇది వారి దురదృష్టం మాత్రమే. కానీ భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడే వారిని మేము వదిలిపెట్టబోము’ అని హెచ్చరించారు.

పాకిస్థాన్‌ గాజులు తొడుక్కుని ఏం లేదని ఫరూక్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై షిండే తీవ్రంగా మండిపడ్డారు. పాక్ గురించి ప్రశ్నించడానికి వీళ్లెవరు? పాకిస్థానీలా, హిందుస్థానీలా? దేశద్రోహులా? అని ప్రశ్నించారు. ఎన్సీపీ(శరద్ చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ సుధీర్ఘ కాలం రాష్ట్రంలో, కేంద్రంలో పని చేసినా రాష్ట్రానికి మాత్రం ఏమీ చేయలేదని విమర్శించారు. మహారాష్ట్ర రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం దీనికి మరో రూ.6 వేలు కలిపి ప్రతి ఏటా రైతులకు రూ.12 వేలు ఇస్తున్నామన్నారు. పంటల బీమాను ఉచితంగా అందజేస్తున్నామని, రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని వెల్లడించారు. పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరూ చూశారని తెలిపారు. 

Tags:    

Similar News