అస్సాంలో నియోజకవర్గాల పునర్విభజనపై స్టేకు సుప్రీం 'నో'

అస్సాంలో ఎన్నికల సంఘం చేపట్టిన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Update: 2023-07-24 14:36 GMT

న్యూఢిల్లీ : అస్సాంలో ఎన్నికల సంఘం చేపట్టిన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇందుకోసం ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రారంభించిన కసరత్తును మధ్యలో ఆపబోమని తేల్చి చెప్పింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై స్టే విధించాలంటూ 9 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. దీనిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రానికి, ఎన్నికల కమిషన్‌‌కు నోటీసులు జారీ చేసింది.

అస్సాంలో నియోజక వర్గాల పునర్విభజనకు సంబంధించి జూన్ 20న ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్‌లోని పలు ప్రతిపాదనలపై పిటిషనర్లకు అభ్యంతరం ఉందని వారి తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. వివిధ జిల్లాలకు వేర్వేరు సగటు అసెంబ్లీ పరిమాణాలను తీసుకోవడాన్ని పిటిషనర్లు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. డీలిమిటేషన్ ప్రక్రియలో జన సాంద్రత లేదా జనాభా ఎటువంటి పాత్ర పోషించదని ఆయన వాదించారు. ఈ పిటిషన్లు దాఖలు చేసిన పార్టీల్లో కాంగ్రెస్, రైజోర్ దళ్, అస్సాం జాతీయ పరిషత్, సీపీఐ(ఎం), సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీ, ఆర్జేడీ, అంచలిక్ గణ మోర్చా ఉన్నాయి.

Tags:    

Similar News