ఎన్‌ఓసీ లేకుండానే గేమింగ్ జోన్ నిర్వహణ

వారిలో చిన్నారులతో సహా 28 మంది గాయపడ్డారని రాజ్‌కోట్ పోలీస్ కమిషనర్ చెప్పారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు

Update: 2024-05-26 14:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ మాల్‌లో శనివారం జరిగిన దారుణ అగ్ని ప్రమాదంలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. మాల్‌లోని గేమింగ్ జోన్‌లో మంటలు చెలరేగడంతో ఇప్పటివరకు 20 మందికి పైగా మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. వారిలో చిన్నారులతో సహా 28 మంది గాయపడ్డారని రాజ్‌కోట్ పోలీస్ కమిషనర్ చెప్పారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. కొందరి మృతదేహాలు ఎక్కువగా కాలిపోవడంతో గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు తెలిపారు. శిథిలాల్లో మరికొందరి మృతదేహాలు ఉండొచ్చని వారు వెల్లడించారు. మంటలు చెలరేగిన సమయంలో కొందరు కిటికీల గుండా బయటపడ్డారు. ప్రమాదం జరిగేందుకు ప్రధానంగా ఒకే ఒక ఎగ్జిట్ పాయింట్ ఉండటమేనని అధికారులు స్పష్టం చేశారు. గేమ్ జోన్ పరిధిలో జనరేటర్‌ల కోసం వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ నిల్వ వుంచారు. అగ్నిప్రమాద ఘటనలో మరణాల సంఖ్య పెరగేందుకు ఇది కూడా ముఖ్యకారణం. అంతేకాకుండా నిర్వాహకులు అగ్నిమాపక శాఖ నుంచి నో ఆబ్జెక్టివ్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) కూడా తీసుకోలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి గేమింగ్ జోన్ యజమాని, మేనేజర్‌తో సహా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో టీఆర్‌పీ గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్, యజమాని యువరాజ్ సింగ్ సోలంకి ఉన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదివారం అగ్నిమాపక ప్రాంతాన్ని సందర్శించి సహాయక చర్యలపై ఆరా తీశారు. సహాయక చర్యల గురించి తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పటేల్‌తో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల సిట్ 72 గంటల్లోగా నివేదిక సమర్పించనుంది.

ప్రధాన కారణాలు..

గేమింగ్ జోన్‌లోని ఉన్న ఒకేఒక ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ ఆరు నుంచి ఏడు అడుగుల ఎత్తులో ఉంది. శనివారం ఎంట్రీ ఫీజు రూ.99 కావడంతో అక్కడ భారీ రద్దీ నెలకొంది. ఇంకా, మొదటి అంతస్తు నుంచి బయటకు రావడానికి ఒకే ఒక మార్గం ఉంది. జనరేటర్ల కోసం టీఆర్‌పీ గేమ్ జోన్‌లో దాదాపు 2,000 లీటర్ల డీజిల్ నిల్వ చేయబడింది, గో-కార్ట్ రేసింగ్ కోసం 1,000 నుంచి 1,500 లీటర్ల పెట్రోల్ నిల్వ చేయబడింది. వీటివల్లే మంటల తీవ్రత పెరిగింది.

ప్రమాదం మానవ తప్పిదమే.. హైకోర్టు

రాజ్‌కోట్‌ దుర్ఘటన ప్రాథమికంగా మానవ తప్పిదంగానే కనిపిస్తోందని గుజరాత్‌ హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై సోమవారం సుమోటోగా విచారణ చేపడతామని ప్రకటించింది. ఇదే సమయంలో అగ్ని ప్రమాదానికి విద్యుత్ లోపం కూడా కారణం కావొచ్చని రాజ్‌కోట్ జిల్లా మేజిస్ట్రేట్ అభిప్రాయపడ్డారు. గేమింగ్ జోన్లు, రిక్రియేషన్ క్లబ్‌లు అనుమతులు లేకుండా నడుస్తున్నాయన్న హైకోర్టు.. అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్‌ నగరపాలక సంస్థల తరఫు న్యాయవాదులు సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తున్నారో తమకు వివరించాలని స్పష్టం చేసింది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని అన్ని గేమింగ్ జోన్‌లను తనిఖీ చేయాలని, ఫైర్ సేఫ్టీ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వాటిని మూసివేయాలని గుజరాత్ డీజీపీ సైతం ఆదేశించారు. 

Tags:    

Similar News