ఎడారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత
ఎడారి రాష్ట్రం రాజస్థాన్ ఎండలతో మండిపోతోంది. గురువారం రోజు రాజస్థాన్లోని బార్మర్లో 48.8 డిగ్రీల సెల్సీయస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది
దిశ, నేషనల్ బ్యూరో: ఎడారి రాష్ట్రం రాజస్థాన్ ఎండలతో మండిపోతోంది. గురువారం రోజు రాజస్థాన్లోని బార్మర్లో 48.8 డిగ్రీల సెల్సీయస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది దేశంలో నమోదైన అత్యధిక టెంపరేచర్ ఇదే కావడం గమనార్హం. గురువారం రోజు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్లలోని దాదాపు 16 ప్రదేశాలలో 45 డిగ్రీల సెల్సీయస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే ఐదు రోజుల పాటు ఉత్తర భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లకు ‘రెడ్’ అలర్ట్ను జారీ చేసింది. గురువారం రోజు రాజస్థాన్లోని చురులో 47.4 డిగ్రీలు, ఫలోడిలో 47.8 డిగ్రీలు, జైసల్మీర్లో 47.2 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. రాజస్థాన్లో వడగాలుల కారణంగా దాదాపు ఐదుగురు చనిపోయారు.