కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉంది.. ఆప్ అధినేతను కలిసిన పంజాబ్ సీఎం

జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం కలిశారు.

Update: 2024-04-30 10:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇన్సులిన్ తీసుకుంటున్నారని విలేకరులతో చెప్పారు. ప్రజలు తన గురించి ఆందోళన చెందవద్దని, లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రజలను కోరినట్లు భగవంత్ మాన్ తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల తరుపున చురుకుగా ప్రచారం చేయాలని, ఈ ఎన్నికలు గెలుపు ఓటములకు సంబంధించినవి కావు.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమేనని ఆప్ అధినేత తనకు చెప్పినట్లు పంజాబ్ సీఎం పేర్కొన్నారు.

ప్రజలు అన్ని సౌకర్యాలు పొందుతున్నారని, పంజాబ్ ప్రభుత్వ పాఠశాలల నుండి 158 మంది పిల్లలు JEE (మెయిన్స్) ఉత్తీర్ణులయ్యారని ఆయనకు చెప్పడంతో చాలా సంతోషించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలను అరవింద్ కేజ్రీవాల్‌ అభినందించారని భగవంత్ మాన్ విలేకరుల సమావేశంలో అన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కేజ్రీవాల్‌ అరెస్టయి జైలుకు వెళ్లాక పంజాబ్ సీఎం కలవడం ఇది రెండోసారి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News