శామ్ పిట్రోడా వ్యాఖ్య‌ల‌తో కాంగ్రెస్‌కు సంబంధం లేదు: కార్తీ చిదంబ‌రం

ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని, ఇప్పటికే పార్టీ ఈ విషయాన్ని తేల్చి చెప్పిందని పేర్కొన్నారు.

Update: 2024-05-09 15:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి కార్తీ చిదంబరం ఖండించారు. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని, ఇప్పటికే పార్టీ ఈ విషయాన్ని తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. శామ్ పిట్రోడా తమ పార్టీ చీఫ్ కాదని, దేశ ప్రధాని లేదా పార్టీ అధ్యక్షుడో కాదని కార్తీ చిదంబరం స్పష్టం చేశారు. ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశారు, కాబట్టి ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని వెల్లడించారు. శివగంగ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కార్తీ చిదంబరం తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తవగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, ఇటీవల శామ్ పిట్రోడా భారత్‌లోని ఈశాన్య ప్రజలు చైనీయుల్లా, దక్షిణాదివారు ఆఫ్రికన్లుగా, పశ్చిమ ప్రాంత ప్రజలు అరబ్బుల్లా ఉంటారని అన్నారు. ఈ జాత్యహంకార వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం కావడంతో ఆయన ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ కాంగ్రెస్ పదవికి రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది.

Tags:    

Similar News