26,000 మంది వలస కశ్మీరీ పండిట్ల కోసం ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు

అనంతనాగ్ నియోజకవర్గంలో 34 ప్రత్యేక పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Update: 2024-05-24 12:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆరో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా 26,000 మంది కశ్మీరీ పండిట్ ఓటర్లు శనివారం జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ నియోజకవర్గంలో 34 ప్రత్యేక పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. దీని తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో పూర్తిస్థాయి ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లోని నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. అనంతనాగ్ నియోజకవర్గ పోలింగ్‌కు జమ్మూ, ఉదంపూర్ జిల్లాల్లో కశ్మీరీ పండిట్ల కోసం ఏర్పాటైన ప్రత్యేక పోలింగ్ స్టేషన్లకు భద్రతా బలగాలను పంపినట్టు అధికారులు స్పష్టం చేశారు. 26 వేల మంది కశ్మీరీ పండిట్ ఓటర్లు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు వేసేందుకు పోలింగ్ ఏర్పాట్లు చేశామని రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కమిషనర్ డా అరవింద్ కర్వానీ చెప్పారు. జమ్మూలోని 21 పోలింగ్ బూత్‌లు, 8 సహాయక బూత్‌లు, ఉదంపూర్‌లో ఒకటి, ఢిల్లీలోని నాలుగు పోలింగ్ బూత్‌లలో ఎన్నికల అధికారులతో ఏర్పాట్ల గురించి సమీక్షించ జరిపినట్టు ఆయన పేర్కొన్నారు. కశ్మీరీ వలస ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తాగునీరు, వసతితో సహా అన్ని అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశామని, వలసదారులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా ఓటర్ల పిక్ అండ్ డ్రాప్ సదుపాయం కూడా ఎన్నికల సంఘం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. అననంత్‌నాగ్ నియోజకవర్గంలో 9.02 లక్షల మహిళలతో కలిపి దాదాపు 18.36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

Tags:    

Similar News