మణిపూర్‌లో మరోసారి రీ పోలింగ్: ఈసీ ఆదేశాలు

ఔటర్‌ మణిపూర్‌ లోక్‌సభ స్థానంలోని 6 పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్(ఈసీ) తెలిపింది. రెండో దశలో భాగంగా ఈ పోలింగ్ బూతుల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది.

Update: 2024-04-28 04:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఔటర్‌ మణిపూర్‌ లోక్‌సభ స్థానంలోని 6 పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్(ఈసీ) తెలిపింది. రెండో దశలో భాగంగా ఈ పోలింగ్ బూతుల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది. అయితే ఇక్కడ పలు అవాంతరాలు చోటుచేసుకున్నందు వల్ల ఆ పోలింగ్ రద్దు చేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఈ బూత్‌ల వద్ద ఈవీఎంలు పగలగొట్టడంతో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే రిగ్గింగ్ జరిగిందని, బలవంతంగా ఓటు వేయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ కూడా దీనిపై ఫిర్యాదు చేసింది. మళ్లీ ఓటింగ్ చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మరోసారి ఓటింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఈ మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టం1951లోని సెక్షన్ 58 (2) , 58 A (2) ప్రకారం ఆదేశాలు జారీ చేసింది.

షాంగ్‌షాక్ ఎ, ఉఖ్రుల్ (ఎ), ఉఖ్రుల్ (D-1), ఉఖ్రుల్ (F), చింగై,ఓయినం (A1) బూతుల్లో రీ పోలింగ్ జరగనున్నట్టు ప్రధాన ఎన్నికల అధికారి ప్రదీప్ కుమార్ ఝా తెలిపారు. రీ పోలింగ్‌కు ఓటర్లు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఔటర్ మణిపూర్ పార్లమెంట్ స్థానం పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను13 సెగ్మెంట్లలో ఉన్న 848 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 26న పోలింగ్ జరిగింది. కాగా, మణిపూర్‌లో జరిగిన మొదటి దశ ఎన్నికల్లోనూ పలు పోలింగ్ బూతుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈసీ రీపోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే.  

Tags:    

Similar News