దేశంలో నదుల అనుసంధానం.. కేంద్ర జలశక్తి శాఖ వెల్లడి
నదుల అనుసంధానానికి సంబంధించి నివేదికలు పూర్తయ్యాయని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో నదుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా గుర్తించిన మొత్తం 30 లింకులలో 8 లింకు ప్రాజెక్ట్లకు సంబంధించి సవివర ప్రాజెక్ట్ నివేదికలు పూర్తయ్యాయని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మరికొన్ని లింకు ప్రాజెక్ట్లకు సంబంధించి ఫీజిబిలిటీ(సాధ్యాసాధ్యాల) నివేదికలు పూర్తయినట్లుగా స్పష్టంచేశారు. ప్రభుత్వ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ కింద నదుల అనుసంధానం కోసం జాతీయ జలాభివృద్ధి సంస్థ(ఎన్డబ్ల్యూడీఏ) దేశవ్యాప్తంగా 30 లింకులను గుర్తించింది. ఈ లింకులన్నింటికీ ప్రీ ఫీజిబిలిటీ నివేదికలు పూర్తయ్యాయి. నదుల అనుసంధాన ప్రాజెక్ట్ అమలు కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం భరించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించారు. నదుల అనుసంధానం ప్రాజెక్ట్ అమలు దశలో మాత్రమే ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయం, నిధుల సమీకరణ వంటి తదితర అంశాలు చర్చకు వస్తాయని కేంద్ర జల శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు.