నటి లైలా ఖాన్‌ సవతి తండ్రికి మరణశిక్ష.. 13 ఏళ్ల తర్వాత తీర్పు

బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 13 ఏళ్ల క్రితం సంచలన సృష్టించిన ఈకేసులో ఆమె సవతి తండ్రికి మరణశిక్ష విధించింది కోర్టు.

Update: 2024-05-24 16:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 13 ఏళ్ల క్రితం సంచలన సృష్టించిన ఈకేసులో ఆమె సవతి తండ్రికి మరణశిక్ష విధించింది కోర్టు. లైలా ఖాన్ సవతి తండ్రి అయిన పర్వేజ్ తక్ 2011లో ఆమెతో పాటు ఆమె తల్లి, నలుగురు తోబుట్టువులను హత్య చేశాడు. ఈ హత్య కేసు అత్యంత అరుదైన కేటగిరీ అని ముంబై సెషన్స్ కోర్టు వ్యాఖ్యానించింది. హత్య, సాక్ష్యాలు ధ్వంసం చేసినందుకు మే 9న పర్వేజ్ తక్‌ని కోర్టు దోషిగా తేల్చింది.

2011 జనవరి 30న లైలా తన తల్లి షెలీనా, నలుగురు సోదరీమణులతో కలిసి నాసిక్‌ జిల్లాలోని ఇగత్‌పురిలో గల తమ ఫామ్‌హౌస్‌కు వెళ్లింది. ఆ తర్వాత నుంచి వీరంతా అదృశ్యమయ్యారు. దీంతో లైలా తండ్రి నదీర్ షా పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. లైలా సవతి తండ్రి, షెలీనా మూడో భర్త పర్వేజ్ తక్ పై సందేహం వ్యక్తం చేశారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2012 జూన్ లో పర్వేజ్ తక్ ను ఓ కేసులో జమ్ము పోలీసులు అరెస్టు చేశారు. విచారణ టైంలో లైలా, ఆమె కుటుంబాన్ని తానే హత్య చేసినట్లు పర్వేజ్ తక్ ఒప్పుకున్నాడు. ముంబై పోలీసులకు సమాచారమివ్వగా.. ఈ ఉదంతం బయటకొచ్చింది. షెలీనా, ఆమె పిల్లల ఆస్తుల విషయంలో తగాదా వచ్చింది. షెలీనా తలపై రాడ్ తో కొట్టి చంపాడు. లైలాను, ఆమె సోదరీమణులను కూడా క్రూరంగా చంపినట్లు దర్యాప్తులో తేలింది. ఆరుగురి డెడ్ బాడీలను ఫాంహౌజ్ నుంచి బయటకు తీశారు. ఆ తర్వాత పర్వేజ్ తక్ ను అరెస్టు చేశారు. హంతకుడికి లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య తర్వాత నేపాల్‌ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా జుమ్ముకశ్మీర్ పోలీసులకు చిక్కాడు.

Similar News