సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న కపిల్ సిబల్

రెండు దశాబ్దాల తర్వాత కపిల్ సిబల్‌ ఈ పదవికి పోటీ చేయనుండటం విశేషం.

Update: 2024-05-08 13:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 16న ఎన్నికలు జరగనున్న సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్‌సీబీఏ) అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఎస్‌సీబీఏ గౌరవ కార్యదర్శి రోహిత్ పాండే తెలిపారు. రెండు దశాబ్దాల తర్వాత కపిల్ సిబల్‌ ఈ పదవికి పోటీ చేయనుండటం విశేషం. హార్వర్డ్ లా స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన ఆయన చివరిగా 1995-2002 మధ్యకాలంలో ఎస్‌సీబీఏ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకు ముందు కూడా 1995-1996, 1997-1998లో రెండుసార్లు అదే బాధ్యతలు నిర్వహించారు. 1989-90ల సమయంలో దేశ అదనపు సొలిసిటర్ జనరల్‌గా చేసిన కపిల్ సిబల్, 1983లో సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. ప్రస్తుతం ఎస్‌సీబీఏ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఆదిష్ అగర్వాలా ఉన్నారు. ఎస్‌సీబీఏ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్‌తో సహా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకునే ఎన్నికలు మే 16న జరుగుతాయి. దీనికి నామినేషన్ దాఖలు చేయడానికి మే 9తో గడువు ముగుస్తుంది. గతంలో సుప్రీంకోర్టు ఎస్‌సీబీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కొన్ని పోస్టులను మహిళా సభ్యులకు రిజర్వ్ చేయాలని ఆదేశించింది. ఈ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ కోశాధికారి పదవిని మహిళలకు రిజర్వ్ చేయాలని న్యాయమూర్తులు సూర్యకాంత్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మే 18న ఓట్ల లెక్కించు, మే 19న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

Tags:    

Similar News