ప్రజలతో కనెక్ట్ అవడానికే రాజకీయాల్లోకి వచ్చా: మాజీ క్రికెటర్ యూసఫ్ ఫఠాన్

ప్రజలతో మమేకమై ఉండటానికే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ నేత యూసఫ్ పఠాన్ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్‌ లోక్ సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున పోటీలో ఉన్న ఆయన ఆదివారం ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు.

Update: 2024-04-21 09:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజలతో మమేకమై ఉండటానికే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ నేత యూసఫ్ పఠాన్ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్‌ లోక్ సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున పోటీలో ఉన్న ఆయన ఆదివారం ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. ‘బహరంపూర్ ప్రజలు ఇప్పటికే నన్ను కుమారుడిగా, సోదరుడిగా, స్నేహితుడిగా అంగీకరించారు. ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వచ్చినా రాజీకీయాల్లోనే కొనసాగుతా. స్థానిక ప్రజలతోనే మమేకమవుతా. ప్రజలే నా బలం’ అని వ్యాఖ్యానించారు. ఎంపీగా గెలుస్తాననే పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.

కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరిపై తనకు నమ్మకం ఉందని తెలిపారు. కానీ చాలా ఏళ్ల నుంచి ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నా బహరంపూర్ ప్రాంతం అభివృద్ధి చెందలేదని చెప్పారు. మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి కేంద్రం నుంచి తగినన్ని నిధులు తీసుకురావడంలో ఆయన ఫెయిల్ అయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారని తెలిపారు. ఆయన ఎందుకు విపలమయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బహరంపూర్ ప్రజలు తనను గెలిపిస్తే ఇక్కడ అనేక సమస్యలను గుర్తించానని వాటన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

కాగా, గుజరాత్‌కు చెందిన యూసఫ్ పఠాన్‌ను పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ తన అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎన్నికల పోరు ఉత్కంఠగా మారింది. అయితే ఐపీఎల్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడినప్పటి నుంచి మమతా బెనర్జీ తనకు సుపరిచితమని తెలిపారు. రాష్ట్రంలో మమతా చేపట్టిన అభివృద్ధిని స్వయంగా చూడగలిగానని అందుకే టీఎంసీలో జాయిన్ అయినపట్టు వెల్లడించారు.   

Tags:    

Similar News