సైబర్ దాడుల్లో మూడో స్థానంలో భారత్

ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో దాదాపు 33 శాతంతో ఎక్కువ ప్రభావితమవుతున్న పరిశ్రమగా నిలిచిందని ఓ నివేదిక తెలిపింది.

Update: 2024-04-30 18:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో సైబర్ దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా యూఎస్, యూకే తర్వాత సైబర్ దాడులకు గురవుతున్న మూడో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో దాదాపు 33 శాతంతో ఎక్కువ ప్రభావితమవుతున్న పరిశ్రమగా నిలిచిందని ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ జీస్కేలర్ తాజా నివేదిక ప్రకారం, గతేడాది కాలంలో గ్లోబల్ సైబర్ దాడులు 60 శాతం పెరిగాయి. 2023లో దేశీయంగా టెక్నాలజీ రంగం ఎక్కువ సైబర్ దాడులకు గురవగా, ఆ తర్వాత ఫైనాన్స్, బీమా రంగాలు ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. అంతేకాకుండా ఫైనాన్స్, బీమా రంగాల్లో అత్యధిక సైబర్ దాడి ప్రయత్నాలు జరిగాయని, ఇది మునుపటి ఏడాదితో పోలిస్తే 393 శాతం పెరిగినట్టు నివేదిక తెలిపింది. దేశంలో డిజిటల్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి సైబర్ దాడి యత్నాలకు అవకాశాలు పెరుగుతున్నాయి. వీటి తర్వాత తయారీ పరిశ్రమలో సైబర్ దాడులు 2022 నుంచి 2023 నాటికి 31 శాతం పెరిగాయి. ఈ రంగంలో ఏఐ టెక్నాలజీ వినియోగం వృద్ధి చెందటంతో సైబర్ నేరగాళ్లు సులభ లక్ష్యాలుగా ఎంచుకుంటున్నారని నివేదిక అభిప్రాయపడింది. నివేదిక ప్రకారం, 2023లో సైబర్ స్కామ్‌లు ఎక్కువగా యూఎస్(55.9 శాతం), యూకే(5.6 శాతం, ఇండియా(3.9 శాతం) లక్ష్యంగా ఉన్నాయి. భారత్ మొత్తం 7.9 కోట్ల సైబర్ దాడులను ఎదుర్కొన్నదని నివేదిక స్పష్టం చేసింది. వినియోగదారుల డేటాను దొంగలించేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను కనుగొన్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు డిజిటల్ పర్సనల్ డేటా రక్షణ చట్టం అమలు వంటి చర్యలను భారత ప్రభుత్వం చేపడుతోందని జీస్కేలర్ ఆసియా పసిఫిక్, జపాన్ సీటీఓ సుదీప్ బెనర్జీ తెలిపారు. ఇక, అత్యధికంగా సిబర్ దాడులను ఎదుర్కొన్న వాటిలో టెలిగ్రామ్(7.93 లక్షలు) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఫేస్‌బుక్(5.32 లక్షలు), వాట్సాప్(3.79 లక్షలు) ఉన్నాయి. 

Tags:    

Similar News