ఫర్నీచర్ బద్దలు కొట్టి.. ‘కోట్ల’ కట్టలు బయటపెట్టి..

దిశ, నేషనల్ బ్యూరో : ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులా.. మజాకా !! ఎట్టకేలకు చిక్కుముడిని విప్పారు.

Update: 2024-05-26 17:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులా.. మజాకా !! ఎట్టకేలకు చిక్కుముడిని విప్పారు. మహారాష్ట్రలోని నాసిక్​లో ఉన్న సురానా జ్యువెల్లర్స్ దుకాణం, యజమాని కార్యాలయంపై గురువారం సాయంత్రం రైడ్స్ మొదలుపెట్టిన ఐటీ అధికారులకు అంతుచిక్క లేదు. 55 మంది టీమ్‌తో రైడ్స్ చేస్తున్నా డబ్బులు బొత్తిగా దొరకలేదు. రాకా కాలనీలో ఉన్న సురానా జ్యువెల్లర్స్ యజమాని బంగ్లాలో సైతం చిల్లిగవ్వ కనిపించలేదు. సంస్థ యజమాని ప్రైవేట్ లాకర్లలోనూ కొద్దిపాటి నగదే దొరికింది. సురానా జ్యువెల్లర్స్ యజమాని బంధువు విలాసవంతమైన బంగ్లాలో తనిఖీలకు వెళ్లగా అక్కడ కూడా డబ్బు దొరకలేదు. గురువారం, శుక్రవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. లెక్కలన్నీ పర్ఫెక్టుగానే ఉన్నాయని సురానా జ్యువెల్లర్స్ నిర్వాహకులు బుకాయించారు.

అనుమానం వచ్చి అలా చేయగానే..

ఐటీ అధికారులకు అనుమానం వచ్చి శనివారం రోజు సురానా జ్యువెల్లర్స్ యజమాని బంధువు బంగ్లాలోని ఫర్నీచర్‌ను బద్దలు కొట్టించారు. దీంతో వాటిలో నుంచి నగదు కట్టలు పెద్దఎత్తున బయటపడ్డాయి. ఆ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సెలవు. దీంతో నాసిక్‌లోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయానికి ఆ డబ్బుల కట్టలను తరలించారు. ఏడు కార్లలో ట్రాలీ బ్యాగులు, క్లాత్ బ్యాగుల్లో పెట్టి ఈ డబ్బును బ్యాంకుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. దాదాపు 14గంటలపాటు అధికారులు లెక్కించగా.. మొత్తం రూ.26 కోట్ల నగదు దొరికిందని వెల్లడైంది. అదంతా ఐటీ శాఖకు లెక్కల్లో చూపించని డబ్బేనని అధికారులు వెల్లడించారు. రూ.90 కోట్లు విలువైన ఆస్తి పత్రాలను కూడా ఈ రైడ్స్ సందర్భంగా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సురానా జ్యువెలర్స్‌ యాజమాన్యం పన్ను ఎగవేతకు పాల్పడుతోందనే కారణంతో ఈ తనిఖీలు నిర్వహించామని చెప్పారు. గురువారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు దాదాపు 30గంటల పాటు తమ సోదాలు జరిగాయన్నారు. ఈ తనిఖీల్లో నాసిక్, నాగ్‌ పుర్, జల్గావ్‌లకు చెందిన మొత్తం 55 మంది ఐటీ శాఖ సిబ్బంది పాల్గొన్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News