ముందుగా గుడికి దండం పెట్టి ఇంటి పై బాంబులు విసిరిన దుండగుడు
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తనకు గుండా మామూలు చెల్లించలేదని ఓ ఇంటిపై బాంబులు విసిరాడు.
దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తనకు గుండా మామూలు చెల్లించలేదని ఓ ఇంటిపై బాంబులు విసిరాడు. అయితే దుండగుడు బాంబులు విసిరేముందు అక్కడ ఉన్నటువంటి గుడికి దండం పెట్టుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డు కాగా, ఇప్పుడు అది సోషల్మీడయాలో వైరల్ అయింది. జబల్పూర్లోని ఘమాపూర్ ప్రాంతంలోని భారత్ కృషి సమాజ్ స్కూల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.
ఆనంద్ ఠాకూర్ అనే వ్యక్తి ఒక ఇంటిపై బాంబులు విసిరి భయాందోళనలకు గురి చేశాడు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన దాని ప్రకారం, ఆనంద్ రెండు చేతుల్లో బాంబులు తీసుకుని నడుచుకుంటూ వెళ్తూ, మాన్సింగ్ ఠాకుర్ ఇంటి దగ్గరకు రాగానే, ఒకదాని తర్వాత ఒకటి బాంబులు విసిరాడు. వాటిలో ఒక బాంబు పేలలేదు, మరొకటి పేలడంతో ఆ ఇంటిలోపల, బయట పొగ కమ్ముకుంది. అయితే దాడికి ముందు నిందితుడు సమీపంలోని ఆలయం ముందు దండం పెట్టుకున్నాడు.
ఆనంద్ ఠాకూర్ అక్కడి ఏరియాలో గుండాగా చలామణి అవుతున్నాడు. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి చిరు వ్యాపారులను బెదిరించి డబ్బు వసూళ్లుకు పాల్పడుతున్నట్లు నిందితునిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై అక్కడి నివాసితులు ఘమాపూర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఠాకూర్ను కనిపెట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.