'పరిమిత కాలానికి మాత్రమే బెయిల్ మంజూరు చేయడం వ్యక్తి స్వేచ్ఛను హరించడమే'

ఒక వ్యక్తి బెయిల్‌కు అర్హుడని కోర్టు నిర్ధారించిన తర్వాత, పరిమిత కాలానికి మాత్రమే బెయిల్ మంజూరు చేయడం, ఆ వ్యక్తి స్వేచ్ఛా హక్కులను హరించడమేనని సుప్రీంకోర్టు తెలిపింది.

Update: 2023-12-03 13:15 GMT

న్యూఢిల్లీ: ఒక వ్యక్తి బెయిల్‌కు అర్హుడని కోర్టు నిర్ధారించిన తర్వాత, పరిమిత కాలానికి మాత్రమే బెయిల్ మంజూరు చేయడం, ఆ వ్యక్తి స్వేచ్ఛా హక్కులను హరించడమేనని సుప్రీంకోర్టు తెలిపింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం, 1985 కింద ఆరోపించిన నేరాలకు సంబంధించి ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్న వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, దీనివల్ల గతంలో మంజూరు చేసిన బెయిల్ పొడిగింపు కోసం మళ్లీ ఫ్రెష్ బెయిల్ వ్యాజ్యంపై అదనపు భారం పడుతుందని పేర్కొంది. 'నిందితుడు విచారణ పెండింగ్‌లో బెయిల్ పొందేందుకు అర్హుడని కోర్టు నిర్ధారించినప్పుడు, పరిమిత కాలానికి మాత్రమే బెయిల్ మంజూరు చేయడం చట్టవిరుద్ధం.

అలాంటి ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛా హక్కును ఉల్లంఘించినట్టేనని' జస్టిస్ అభయ్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. కాగా, కేసుకు సంబంధించి విచారణ ముగిసే అవకాశం లేకపోవడంతో అప్పీలుదారును సుదీర్ఘకాలం జైలులో ఉంచారని ఒరిస్సా హైకోర్టు తీర్పులో అభిప్రాయపడింది. దీంతో ఆయన బెయిల్‌ను పొడిగింపునకు అర్హులని హైకోర్టు నిర్ధారించింది. అయితే, హైకోర్టు అతనికి 45 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసి, దరఖాస్తును రద్దు చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సదరు వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను పరిశీలిస్తే బెయిల్‌పై వచ్చేందుకు అప్పీలుదారుకు అర్హత ఉందని న్యాయమూర్తి నిర్ధారించినట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.

Tags:    

Similar News