సునితా విలియమ్స్ అంతరిక్షంలోకి ఏమేం తీసుకెళ్తోందో తెలుసా ?
భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో ఈనెల 7న అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్నారు. ఇంతకు ముందు బోయింగ్ కంపెనీ మానవ రహిత ప్రయోగాలు చేపట్టగా.. తొలిసారిగా మానవ సహిత యాత్ర చేపడుతున్నది. స్టార్లైనర్ స్పేస్షిప్ ను ఈనెల 7న ఉదయం 8.04 గంటలకు కెన్నడీ స్పేస్సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఇందులో ఆమె మిషన్ పైలట్గా వ్యవహరించనున్నారు.
ఈ సందర్భంగా సునితా విలియమ్స్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గణేశుడు తన గుడ్ లక్ ఛార్మ్ అని పేర్కొన్నారు. రోదసి యానానికి వెళ్లేప్పుడు గణేశుడి విగ్రహాన్ని తనతో పాటు తీసుకెళ్తానని వివరించారు. అలానే తనతో పాటు భగవద్గీతను కూడా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. గతంలో స్పేస్ లోకి వెళ్లినప్పుడు కూడా తాను భగవద్గీతను తీసుకెళ్లినట్లు చెప్పారు. అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా స్టార్లైనర్కు ఇది మొదటి మానవసహిత యాత్ర. కాగా.. ఈ మిషన్ పై తాను కొంచెం ఉద్విగ్నంగా ఉన్నానని చెప్పారు. అదే సమయంలో ఉత్సాహంగా ఉన్నానన్నారు. ఆమె ఒక మారథాన్ రన్నర్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఓసారి మారథాన్ కూడా చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్తుంటే.. ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
నాసా తన ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’లో భాగంగా ఈ మిషన్ చేపట్టింది. ఇందులో సునితా విలియమ్స్తో పాటు మరో వ్యోమగామి బచ్ విల్మోర్ అంతరిక్ష యానం చేయనున్నారు. ఈ రాకెట్లో వీరిద్దరూ ప్రయాణించి , ఐఎస్ఎస్కు చేరుకొని.. అక్కడ వారం రోజుల పాటు ఉండనున్నారు. ఇకపోతే 2006, 2012లో అంతరిక్షంలోకి వెళ్లివచ్చారు సునితా విలియమ్స్. రెండు మిషన్లలో 322 అంతరిక్షంలో గడిపారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు. సునిత 14 జూలై 2012న తన రెండోసారి అంతరిక్షయానం చేశారు. నాలుగు నెలలపాటు అంతరిక్షంలోనే గడిపి.. 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.