బలపరీక్ష నిర్వహించండి..హర్యానా గవర్నర్‌కు దుష్యంత్ చౌతాలా లేఖ

హర్యానాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే.

Update: 2024-05-09 09:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి బలపరీక్ష చేపట్టాలని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ నేత దుష్యంత చౌతాలా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. ప్రభుత్వ మెజారిటీని నిర్ణయించడానికి బలపరీక్ష చేపట్టాలని పేర్కొన్నారు. బీజేపీకి తమ పార్టీ మద్దతు ఇవ్వడం లేదని, ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి శాసనసభలో మెజారిటీ లేదని స్పష్టంగా తెలుస్తోందని వెల్లడించారు. కాబట్టి వెంటనే బలపరీక్ష చేపట్టాలని ఒక వేళ మెజారిటీ రాకపోతే రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ఆర్టికల్ 174 ప్రకారం గవర్నర్ రాజ్యాంగపరమైన ప్రత్యేక హక్కును అమలు చేయాలని కోరారు.

గతంలో బీజేపీ జేజేపీలు రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉండేవారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ పై విభేదాలు రావడంతో ఇటీవల జేజేపీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో తాజాగా ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. అయితే తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ తేల్చి చెప్పారు. తమతో చాలా మంది ఎమ్మెల్యేలు టచ్‌‌‌లో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన పనిలేదని మాజీ సీఎం ఖట్టర్ తెలిపారు. అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారడం గమనార్హం. 

Tags:    

Similar News