భారత్ రానున్న కాంబోడియా రాజు..

కంబోడియా రాజు నోరోడోమ్ సిహామోని ఈ నెల 29, 30, 31 తేదీల్లో భారత్ లో పర్యటించనున్నారు.

Update: 2023-05-26 16:20 GMT

న్యూఢిల్లీ: కంబోడియా రాజు నోరోడోమ్ సిహామోని ఈ నెల 29, 30, 31 తేదీల్లో భారత్ లో పర్యటించనున్నారు. భారత్, కంబోడియాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఒక కంబోడియా రాజు భారత్ రావడం 60 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. రాజు వెంట రాయల్ ప్యాలెస్ మంత్రి, సెనేట్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి, ఇతర అధికారులు సహా 27 మందితో కూడిన ఉన్నతస్థాయి బృందం భారత్ రానుంది.

రాజుకు 30వ తేదీ ఉదయం రాజ్ భవన్ లో గౌరవ వందనంతో స్వాగతం పలుకుతారు. తర్వాత రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీకి నివాళి అర్పిస్తారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, విదేశాంగ మంత్రితో కంబోడియా రాజు సమావేశమవుతారు. రాజుకు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు కూడా ఇస్తారు. 2010లో నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కంబోడియాలో పర్యటించారు. 1959లో నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కూడా కంబోడియా వెళ్లారు.

Tags:    

Similar News