రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే బీజేపీ లక్ష్యం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకే బీజేపీ నిరంతరం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈశాన్య ఢిల్లీ పార్టీ అభ్యర్థి కన్హయ్య కుమార్‌కు మద్దతుగా దిల్షాద్ గార్డెన్‌లో గురువారం జరిగిన ఎన్నికల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

Update: 2024-05-23 10:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకే బీజేపీ నిరంతరం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈశాన్య ఢిల్లీ అభ్యర్థి కన్హయ్య కుమార్‌కు మద్దతుగా దిల్షాద్ గార్డెన్‌లో గురువారం జరిగిన ఎన్నికల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బీజేపీ ఎల్లప్పుడూ రాజ్యాంగాన్ని చింపివేయాలని కోరుకుంటుందని, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు దానిని కాపాడుకునేందుకు జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు. రాజ్యాంగం అంటే కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదని గాంధీ, అంబేడ్కర్, నెహ్రూల సైద్దాంతిక వారసత్వం అని తెలిపారు. రాజ్యంగాన్ని మార్చాలని అనుకుంటున్నట్టు బీజేపీ ఎట్టకేలకు అంగీకరించిందని విమర్శించారు. అయితే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తే కోట్లాది మంది దేశ ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

మోడీ ఇటీవల చేస్తున్న ఎన్నికల ప్రకటనలను ఓ సాధారణ వ్యక్తి చేస్తే నేరుగా మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్తారని ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడుతూ..తాను జీవశాస్త్రపరంగా పుట్టలేదని దేవుడు పంపిన వ్యక్తినని వెల్లడించారు. దేవుడు పంపిన వ్యక్తి కేవలం 22 మంది కోసమే పనిచేయడం విచిత్రంగా ఉందన్నారు. అంబానీ, అదానీల ఇష్టానుసారమే దేశంలో అన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దేశంలోని రైల్వేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు ఇలా అన్ని వారికే ధారాదత్తం చేస్తు్న్నారని మండిపడ్డారు. రుణమాఫీ చేయాలని రైతులు మొత్తుకుంటున్నా వారి మాటలు మోడీ పట్టించుకోవడం లేదన్నారు.

Tags:    

Similar News