ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్: ఏడుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.

Update: 2024-04-30 07:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. నారాయణపూర్-కంకేర్ జిల్లాల సరిహద్దులో ఉన్న అబుజ్‌మడ్ అడవుల్లో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రిజర్వ్ పోలీస్ (డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు మంగళవారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరగగా..ఏడుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. వీరందరి మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఘటనా ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. మరణించిన నక్సలైట్ల వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ జరుగుతున్నట్టు సమాచారం. కాగా, అంతకుముందు ఈ నెల 16న కాంకేర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరగగా 29 మంది మావోయిస్టులు మరణించారు.  

Tags:    

Similar News