ఎన్నికల్లో పోటీకి తాత్కాలిక బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన అమృత్పాల్ సింగ్
ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్పాల్ సింగ్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు.
దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్పాల్ సింగ్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. నామినేషన్ దాఖలు చేయడానికి వీలుగా తాత్కాలికంగా విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న వేర్పాటువాది పంజాబ్లోని శ్రీ ఖాదూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని యోచిస్తున్నారు.
తన పిటిషన్లో, అమృత్పాల్ సింగ్ మే 14న గడువు ముగిసేలోపు ఎన్నికలకు తన నామినేషన్ దాఖలు చేయడానికి వీలుగా ఏడు రోజుల పాటు విడుదలయ్యేలా ఆదేశించాలని కోరాడు. అలాగే ఫొటో దిగడం, కొత్త బ్యాంక్ ఖాతాను తెరవడం సహా ఇతర కాగితపు పనిని పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లను చేయడానికి జైలు అధికారులను ఆదేశించాలని కూడా అతను కోరాడు. భారతదేశ పౌరుడిగా ఖాదూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి ఓటరుగా ఉన్నాను, కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని తన పిటిషనల్ పేర్కొన్నాడు. తండ్రి తార్సేమ్ సింగ్ తన నామినేషన్ దాఖలు చేయడానికి మార్గదర్శకాలను అందించాలని పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్తో పాటు అమృత్సర్ జిల్లా మేజిస్ట్రేట్కు లేఖలు రాశారని కూడా పిటిషన్లో పేర్కొన్నారు.
తన నామినేషన్ గురించి పంజాబ్ ఎన్నికల చీఫ్ లేఖ రాసినప్పటికీ జిల్లా మేజిస్ట్రేట్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని సింగ్ తన పిటిషన్లో ఆరోపించారు. ఖలిస్థాన్ సానుభూతి పరుడు అమృత్ పాల్ సింగ్ అనుచరులు ఫిబ్రవరి 24న పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. దీంతో స్టేషన్లో ఉన్న అతని సన్నిహితుడైన లవ్ప్రీత్ సింగ్ను వదిలివేయాల్సి వచ్చింది. యువతను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై అమృత్ పాల్ను జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అదుపులోకి తీసుకున్నారు.