కుల గణనపై Rahul Gandhi వ్యాఖ్యలకు అఖిలేష్ యాదవ్ కౌంటర్

ప్రతిపక్షాల కూటమి 'ఇండియా'లో కీలక నేతల మధ్య పొరపచ్చాలు కొనసాగుతున్నాయి.

Update: 2023-11-14 07:00 GMT

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల కూటమి 'ఇండియా'లో కీలక నేతల మధ్య పొరపచ్చాలు కొనసాగుతున్నాయి. తాజాగా, కుల గణన వ్యవహారంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కుల గణన ఎందుకు నిర్వహించలేదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ అన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కుల గణన గురించి మాట్లాడుతూ అది ఎక్స్‌రే లాంటిదని, భిన్న వర్గాల సమాచరం తెలుస్తుందని ఓ సభలో అన్నారు. ఈ వ్యాఖ్యలను విమర్శిస్తూనే మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అఖిలేష్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల తప్పుడు విధానాల కారణంగానే ఈ అంశంపై సరైన నిర్ణయం తీసుకోలేదు. కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం ఆశ్చర్యమనిస్తోందన్నారు. ఆ రోజుల్లో ఎక్స్‌రే అవసరమయ్యేది, ఇప్పుడు ఎంఆర్ఐ, సిటీ స్కాన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఆ వ్యాధి వ్యాపించిందని, అప్పుడే ఈ సమస్యను పరిష్కరించి ఉంటే తీవ్రత లేకపోయేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కూడా కుల గణన గురించి మాట్లాడటం పెద్ద అద్భుతమని, ఎక్స్‌రే గురించి మాట్లాడే వ్యక్తులే స్వాతంత్ర్యం తర్వాత కుల గణనను నిలిపివేశారని ఆరోపించారు. 

Tags:    

Similar News