భారతీయ వ్యోమగాములకు త్వరలోనే అధునాతన శిక్షణ: యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి

భారతీయులను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కి పంపే ప్రయత్నంలో భాగంగా భారతీయ వ్యోమగాములకు నాసా త్వరలోనే అధునాతన శిక్షణ అందించనున్నట్టు ఇండియాలోని యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు.

Update: 2024-05-25 03:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయులను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కి పంపే ప్రయత్నంలో భాగంగా భారతీయ వ్యోమగాములకు నాసా త్వరలోనే అధునాతన శిక్షణ అందించనున్నట్టు ఇండియాలోని యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. బెంగళూరులో యూఎస్ కమర్షియల్ సర్వీస్, యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన ‘యూఎస్-ఇండియా స్పేస్ కోఆపరేషన్ కాన్ఫరెన్స్‌’లో గార్సెట్టి ప్రసంగించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఉమ్మడి ప్రయత్నాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇరు దేశాల మధ్య లోతైన అంతరిక్ష సహకారం అవసరమని నొక్కి చెప్పారు. త్వరలోనే పర్యావరణ వ్యవస్థలు, భూమి ఉపరితలం, సహజ ప్రమాదాలు, సముద్ర మట్టం పెరుగుదల, క్రియోస్పియర్‌తో సహా అన్ని వనరులను పర్యవేక్షించడానికి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించాలని సూచించారు.

అంతరిక్ష రంగంలో పెట్టుబడులు పెట్టాలి: ఇస్రో చీఫ్ సోమనాథ్

భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని విస్తరించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతను మరింతగా పెంచేందుకు అంతరిక్ష రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. అంతరిక్ష యుగం ప్రారంభం నుంచి అంతరిక్ష ప్రయత్నాల్లో భారత్-యూఎస్‌ల మధ్య దీర్ఘకాలిక సహకారాన్ని ఎత్తిచూపిన సోమనాథ్.. సుస్థిర చంద్రుని ఉనికిని నెలకొల్పడానికి రెండు దేశాల నాయకత్వం ఉమ్మడి ప్రయత్నాలను ప్రోత్సహిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ 2040 నాటికి చంద్రునిపై తన సొంత వ్యోమగాములను దింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. 2020 నుంచి భారతదేశ అంతరిక్ష రంగంలో అనేక సంస్కరణలు వచ్చాయని కొనియాడారు. అమెరికాలో అనుసరించిన నమూనాల మాదిరిగానే ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం ద్వారా రాకెట్స్, ఉపగ్రహాలను తయారు చేస్తున్నామన్నారు.

‘భారత్-యూఎస్ భాగస్వాముల మధ్య క్లిష్టమైన సాంకేతికతలలో అంతరిక్ష రంగంలో ఉన్న అనుబంధం నిరంతరం బలపడుతోంది. ఈ భాగస్వామ్యం ద్వారా వ్యాపారానికి దేశీయంగా అందుబాటులో ఉన్న ఎంపికలపై ఎంతో సంతోషిస్తున్నా. అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష రంగంలోనూ భారతదేశంతో కనెక్ట్ అవ్వండి’ అని పిలుపునిచ్చారు. అంతరిక్షంలో యూఎస్-భారత్ సహకారం, అవకాశాల గురించి యూఎస్ఐబీసీ ప్రెసిడెంట్ అతుల్ కేశప్ మాట్లాడుతూ.. ఇరుదేశాల అంతరిక్ష భాగస్వామ్యంలో ఒక కొత్త అధ్యాయంగా అభివర్ణించారు. వ్యూహాత్మక పొత్తులు, సహకారం ద్వారా అసాధారణమైన మైలురాళ్లను సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News