కాంగ్రెస్ కు షాక్.. కాషాయ కండువా కప్పుకున్న ప్రముఖ నటుడు
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజస్థాన్ నేత రాధిక ఖేరా కాషాయ పార్టీలో చేరారు.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజస్థాన్ నేత రాధిక ఖేరా కాషాయ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రతినిధి రాధిక ఖేరా ఆదివారం కాంగ్రెస్ పార్టీని వీడారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ బీజేపీలో చేరారు.
పార్టీ అగ్రనేతల వేధింపులు భరించలేకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని రాధిక ప్రకటించారు. అయోధ్యలో రామ మందిరాన్ని తాను సందర్శించడం కాంగ్రెస్ అగ్రనేతలకు ఆగ్రహం తెప్పించిందని పేర్కొన్నారు. చత్తీస్ గఢ్కు చెందిన పార్టీ నేతలు తనను గదిలో బంధించి వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. పార్టీ పెద్దలకు తాను ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేక పార్టీ అని కాషాయ పార్టీలో చేరిన తర్వాత రాధిక పేర్కొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహాత్మ గాంధీ కాంగ్రెస్ కాదని, ఇది హిందూ వ్యతిరేక, రాముడి వ్యతిరేక కాంగ్రెస్ అని మండిపడ్డారు. నటుడు శేఖర్ సుమన్ మాట్లాడుతూ.. చాలా పాజిటివ్ థింకింగ్ తో వచ్చానని తెలిపారు. ప్రధాని మోడీ, అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.