‘26 వారాల అబార్షన్’ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Update: 2023-10-16 11:12 GMT

న్యూఢిల్లీ : 26 వారాల గర్భానికి అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ 27 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మరోసారి తిరస్కరించింది. ఈమేరకు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. ఎయిమ్స్ మెడికల్ బోర్డు రెండోసారి కోర్టుకు సమర్పించిన నివేదికలోనూ గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా ఉందని ప్రస్తావించారు. ఈనేపథ్యంలో బతికే అవకాశాలున్న పిండాన్ని చంపాలని తాము వైద్యులకు ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. గర్భస్త పిండం వయసు 26 వారాల 5 రోజులు దాటిన ప్రస్తుత తరుణంలో అబార్షన్ చేయించుకోవడం చట్టవిరుద్ధమని బెంచ్ పేర్కొంది.

వాస్తవానికి ఈ మహిళ అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇస్తూ జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అక్టోబర్‌ 9న తీర్పు ఇచ్చింది. అనంతరం దీనిపై కేంద్ర సర్కారు రీకాల్ పిటిషన్ దాఖలు చేసి, ఎయిమ్స్ వైద్య నివేదికలను సమర్పించాక సీజేఐ చంద్రచూడ్ సారథ్యంలో ధర్మాసనం మరోసారి వాదనలు విని తీర్పులో సవరణలు చేసింది. కడుపులోని బిడ్డ ప్రాణాలను కాపాడేందుకుగానూ అబార్షన్‌కు పర్మిషన్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పుట్టబోయే బిడ్డ బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేసింది.

Tags:    

Similar News