'ఆప్ కా రామ్ రాజ్య' వెబ్సైట్ను ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రీరామనవమిని పురస్కరించుకుని కొత్తగా ఒక వెబ్సైట్ను ప్రారంభించింది.
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రీరామనవమిని పురస్కరించుకుని కొత్తగా ఒక వెబ్సైట్ను ప్రారంభించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలో రాముడి ఆదర్శాలను సాకారం చేసేందుకు ప్రయత్నించారని చెబుతూ ఈరోజు "రామరాజ్యం" అనే పార్టీ భావనను ప్రదర్శించడానికి "ఆప్ కా రామ్ రాజ్య" అనే వెబ్సైట్ను ఆప్ ప్రారంభించింది. దీనిని 2024 లోక్సభ ఎన్నికలకు ముందు తీసుకురావడం గమనార్హం. వెబ్సైట్ ప్రారంభం సందర్బంగా సంయుక్త విలేకరుల సమావేశంలో, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ, వెబ్సైట్ ఆప్ పార్టీ "రామరాజ్యం" భావనతో పాటు పార్టీ, ప్రభుత్వం చేసిన పనిని ప్రదర్శిస్తుందని చెప్పారు. రామరాజ్యం సాకారం కోసం గత 10 ఏళ్లలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అద్భుతమైన విజయాలను సాధించారు. ప్రజల కోసం మంచి పాఠశాలలు, మొహల్లా క్లినిక్లు, ఉచిత నీరు, విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి వాటిని అందించారని సంజయ్ అన్నారు.
ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు,అరవింద్ కేజ్రీవాల్ తన ప్రజల మధ్య లేకపోవడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. తప్పుడు సాక్షుల వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను నిరాధారమైన కేసులో జైలుకు పంపారని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఈ విలేఖరుల సమావేశంలో ఆప్ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్, జాస్మిన్ షా తదితరులు పాల్గొన్నారు.