ఢిల్లీలో 2500 ఏళ్ల నాటి మానవ జీవన ఆనవాళ్లు!

దేశ రాజధానిలో పురాతన మానవ జీవన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఢిల్లీ పురానా ఖిల్లాలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన తవ్వకాల్లో ఈ విషయం వెలుగు చూసింది.

Update: 2023-05-30 07:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధానిలో పురాతన మానవ జీవన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఢిల్లీ పురానా ఖిల్లాలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన తవ్వకాల్లో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ప్రాంతంలో గత కొంత కాలంగా జరుపుతున్న తవ్వకాల్లో మౌర్యుల కాలానికి ముందు నుంచి మొగలుల వరకు దాదాపు 2500 ఏళ్ల క్రితం మానవ జీవనానికి చెందిన చారిత్రక అవశేషాలను ఏఎస్ఐ కనుగొన్నదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం తవ్వకాలు చేపట్టిన పురానా ఖిల్లా ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అనంతరం తవ్వకాల వివరాలను మీడియాకు వివరించారు. ఈ ప్రాంతంలో పాండవులు సంచరించారనే చరిత్ర ఉందని ఈ పోర్టులోని ఇంద్రప్రస్థ ప్రదేశంలో కాలంగా ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాలు చేపడుతోందన్నారు.

1969 నుంచి 1973 వరకు పద్మశ్రీ బిబిలాల్ నేతృత్వంలో ఓ సారి, 2013 నుంచి 2014 మధ్య రెండోసారి, 2016-2017 మధ్య కాలంలో మూడోసారి ఇక్కడ తవ్వకాలు జరిపిందన్నారు. 2023 జనవరి నుంచి ఈ ప్రాంతంలో తవ్వకాలు నిర్వహించామని ఈ ప్రాంతంలో మొత్తం తొమ్మిది లేయర్స్ ఉన్నట్లు కనుగొన్నామన్నారు. కింద మౌర్యుల కాలం నాటి ఆనవాళ్లు, పైన మొగలుల కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయన్నారు. మౌర్యులు, శుంగులు, కుషానులు, గుప్తులు, రాజపుత్రులు, సుల్తానులు, మొగలులు కాలం నాటి ప్రజలు, ప్రముఖులు ఈ ప్రాంతంలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లభ్యమయ్యాయన్నారు. ఈ ప్రాంతంలో వివిధ కాలం నాటి 130 కంటే ఎక్కువ నాణేలు, మహావిష్ణు విగ్రహం, అమ్మవారి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు లభించాయన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింత ప్రాముఖ్యతను సంతరించుకోబోతోందని చెప్పారు.

Tags:    

Similar News