సెలబ్రేషన్స్ ఓవర్.. రసిఖ్ దార్కు మందలింపు
ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ రసిఖ్ సలాం దార్ను ఐపీఎల్ నిర్వాహకులు మందలించారు.
దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ రసిఖ్ సలాం దార్ను ఐపీఎల్ నిర్వాహకులు మందలించారు. బుధవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 19వ ఓవర్లో సాయి కిశోర్ను అవుట్ చేసిన తర్వాత రసిఖ్ అతిగా సంబరాలు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను మందలింపునకు గురైనట్టు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రవర్తనా నియామళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం రసిఖ్ లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్టు ఐపీఎల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అతను తప్పు ఒప్పుకోవడంతో మ్యాచ్ రిఫరీ ఎలాంటి జరిమానా వేయకుండా కేవలం మందలింపుతో సరిపెట్టాడు.
చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో గుజరాత్ను 4 పరుగుల తేడాతో ఢిల్లీ ఓడించిన విషయం తెలిసిందే. మూడు వికెట్లు తీసిన రసిఖ్ ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ ఈ నెల 27న జరిగే తదుపరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది.