మరో మన్నెం యోధుడు

Another Mannem warrior marre kamayya

Update: 2024-05-05 00:45 GMT

భారత స్వాతంత్ర్య సమయంలో నిప్పుకణికలై ఎగిసిపడుతున్న సమరయోధులలో విస్మరించబడిన ఆదివాసీ వీరయోధులెందరో! స్వాతంత్ర్యానంతరం కూడా పోరాటాలు కొనసాగించిన ఘనచరిత్ర నుంచి మినహాయించబడ్డ ఆదివాసీ పోరుబిడ్డలలో మర్రికామయ్య ఒకరు. విశాఖమన్యంలో కొనసాగిన తెల్లదొరల దాడిలో అమరులైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (1924) తర్వాత రెండో మన్నెం వీరునిగా ప్రసిద్ధికెక్కింది మర్రికామయ్యే అనడం సముచితం.

ఊరు కామయ్యపేటగా మారి..

ఆదివాసీ పోరాట వీరులైన గాం గంటందొర, గాం మల్లుదొర, పడాలు, సింగన్న, గోకేరు ఎర్రేసు వారి అనుచరగణం స్ఫూర్తితోనే సాగిన మర్రికామయ్య పోరాటం కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. కొండదొర తెగకు చెందిన కామయ్య విశాఖపట్నం జిల్లా పాడేరు రెవెన్యూ డివిజన్ లోని ఓ గ్రామంలో జన్మించాడు. కామయ్య మోతుబరి రైతు. అయితే, స్వాతంత్రోద్యమ కాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్యమాలే కామయ్యను చిరకాల ఉద్యమకారుడిగా మార్చాయి. ఆదివాసీల్లో అజ్ఞానం, దారిద్యాన్ని తొలగించడానికి మాడుగుల, అనంతగిరి గ్రామాల్లో కొండజాతి శిశు సంఘాలు ఏర్పాటు చేసి బడులు నిర్వహించడం, జీవనోపాధి పనులు కల్పించడం వంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాడు. ప్రజలు వ్యసనాలకు దూరంగా ఉండి సామాజిక అణచివేతల నుండి విముక్తి చెందాలని కామయ్య 'ఒలేక్' (బుద్ధిజం) మతాన్ని అనుసరించాడు. అది సహించలేని ప్రభుత్వం, ముఠాదార్లు ఏకమై గరుడాపల్లి గ్రామాన్ని తగులబెట్టారు. కామయ్య భూములు, పశువులు, ఆస్తులను స్వాధీనం చేసుకొని వేలం వేశారు. అప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిన కామయ్య కొండకోనల్లో తలదాచుకుంటూ ఉద్యమాన్ని కొనసాగించాడు. తనను నమ్ముకున్న 360 కుటుంబాలను చేరదీసి గరుడాపల్లి పరిసరాల్లోని 'బీటుగరువు' వద్ద వీరికి నివాసాలు ఏర్పాటు చేశాడు. ఆ తరువాతే ఊరు కామయ్య పేటగా మారింది.

అరెస్టయ్యి విడుదలైనా..

బ్రిటీష్ పోలీసులు వీరిని ఎలాగైనా అణచివేయాలనే కుట్రపన్ని, ముఠా దారులతో కలిసి కామయ్య కుటుంబ సభ్యులను, అతని అనుచరులపై దాడులు చేసేవారు. దీంతో కామయ్య కుటుంబంతో పాటు ప్రజలంతా చెల్లాచెదురయ్యారు. అయితే ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా కామయ్య అరెస్టు కాలేదు. కానీ ఓసారి కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యే ఉద్యమకారులకు కుటీరం నిర్మించాడనే నెపంతో అటవీ అధికారులు, పోలీసులు, ముఠాదార్లు కలిసి 1940లో కామయ్యను అరెస్టు చేశారు. విడుదలైన తర్వాత కూడా గ్రామాల్లోని ఆదివాసీల్లో ఆశించిన మార్పు రాలేదు. ప్రజలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక, షాపుకారుల వద్ద మోసపోవడం, వారి సామాజిక వెనుకబాటును చూసి మళ్లీ ఉద్యమించక తప్పని పరిస్థితి. ప్రభుత్వ నిర్బంధం పెరగడంతో కామయ్య మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. నాటి తెల్లదొరల నుండి పెత్తందార్ల వరకు అటవీ సంపదను కొల్లగొట్టడాన్ని, జమీందారీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ, అడవిపై అధికారం ఆదివాసీలకే చెందాలని ఉద్యమించిన ఆదివాసీ మన్నెం యోధుడు మర్రికామయ్య 1959, మే 5న అమరుడయ్యాడు. ఆదివాసీల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను గుర్తు చేసేలా కామయ్యపేట గ్రామం మధ్యలో 1960లో ఒక శిలని ఏర్పాటు చేశారు. గ్రామపరిసరాల్లో కామయ్య జ్ఞాపకార్ధం ఒక గుడి నిర్మించారు.

(నేడు మర్రి కామయ్య వర్ధంతి)

గుమ్మడి లక్ష్మీనారాయణ,

ఆదివాసీ రచయితల వేదిక,

94913 18409

Tags:    

Similar News