డిప్యూటీ తహసీల్దార్ చెంప చెల్లుమనిపించిన మహిళ
ఓ మహిళ డిప్యూటీ తహసీల్దార్ చెంప చెల్లుమనిపించింది.
దిశ, నారాయణఖేడ్ : ఓ మహిళ డిప్యూటీ తహసీల్దార్ చెంప చెల్లుమనిపించింది. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన నారాయణఖేడ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డిలో కుటుంబ సమేతంగా ఉంటున్న సుదిగాని రాజు గౌడ్ అనే డిప్యూటీ తహసీల్దార్ ఎలక్షన్ డ్యూటీ గా నారాయణఖేడ్ కు ఇటీవల వచ్చారు. నారాయణఖేడ్ పట్టణంలోని సువర్ణ టాకీస్ రోడ్ లోని కట్ట మైసమ్మ గుడి సమీపంలో ఒక ఇంట్లో అద్దెకు ఉన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ డిప్యూటీ తహసీల్దార్ ఎలక్షన్ అధికారిగా పని చేశారు. ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్ కావడంతో పట్టణానికి వచ్చాడు. అక్కడ ఉంటున్న ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆయన చెంప చెల్లుమనిపించింది. ఆయన ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీస్తున్నాడని మహిళ వాపోయారు. బాధితురాలు తన భర్తకు సమాచారం ఇవ్వడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణఖేడ్ ఎస్సై విద్యా చరణ్ రెడ్డి పోలీసులతో గురువారం సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిప్యూటీ తహసీల్దార్ పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.