నిజామాబాద్ నగరంలో కత్తిపోట్ల కలకలం..

నిజామాబాద్ నగరంలో ఇచ్చిన డబ్బుల కోసం బైక్ ను లాక్కున్నారని కక్షతో ఇద్దరు అన్నదమ్ములు, మరో ఇద్దరు అన్నదమ్ములపై కత్తులతో దాడి చేశారు.

Update: 2023-04-05 15:28 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలో ఇచ్చిన డబ్బుల కోసం బైక్ ను లాక్కున్నారని కక్షతో ఇద్దరు అన్నదమ్ములు, మరో ఇద్దరు అన్నదమ్ములపై కత్తులతో దాడి చేశారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ వద్ద జరిగింది. నగరంలోని ద్వారక్ నగర్ కు చెందిన మాజీద్, సాజిద్ అనే అన్నదమ్ములు హష్మీకాలనీకి చెందిన షోయాబ్ వద్ద అప్పుగా డబ్బులు తీసుకున్నారు. చాలా రోజులుగా డబ్బులు ఇవ్వకపోవడంతో షోయాబ్ అన్నదమ్ములకు సంబంధించిన బైక్ ను డబ్బులు ఇచ్చి బైక్ తీసుకోవాలని కండిషన్ పెట్టాడు. బుధవారం డబ్బులు ఇచ్చి బైక్ తీసుకుంటామని అతనికి సమాచారం అందించగా ఆటోనగర్ వద్ద మెకానిక్ షాప్ లో ఉన్నామని చెప్పడంతో అక్కడికి అన్నదమ్ములు ఇద్దరు మాజిద్, సాజిద్ లతో పాటు వారి తల్లి ఖాజాబి కూడా అక్కడికి వచ్చింది.

డబ్బులు ఇచ్చే విషయంలో మాటమాట పెరిగి షోయాబ్ తో ఇద్దరు అన్నదమ్ములు గొడవపడ్డారు. ఈ విషయంలో అక్కడ ఉన్న షోయాబ్ మిత్రులైన అన్నదమ్ములు మిర్జా వసీం బేగ్, అద్నాన్ లు సర్ధి చెప్పేందుకు యత్నించారు. దాంతో గొడవ పెద్దదై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో అన్నదమ్ములైన మాజీద్, సాజిద్ లు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో వసీం బేగ్, అద్నాన్ లపై దాడి చేశారు. ఈ సంఘటనలో ఇరువురు కత్తిపోట్లకు గురయ్యారు. వారిని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని 6వ టౌన్ ఎస్ హెచ్ వో సాయికుమార్ గౌడ్ పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో దాడి చేసిన మాజిద్, సాజిద్, వారి తల్లి ఖాజాబీలపై పదుల సంఖ్యలో గంజాయి విక్రయ కేసులు ఉన్నాయి. ఇటీవలనే జైలు నుంచి విడుదలైన మాజిద్, సాజిద్ లు కత్తులతో దాడి చేయడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News