నకిలీ సర్టిఫికెట్ 'దందా'.. కేవలం రూ. 30వేలకే కోరుకున్న యూనివర్శిటీ పట్టా!
నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
దిశ, ఎల్బీనగర్: నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరెట్ క్యాంపు కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి ఈ ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. చైతన్యపురి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేట్టగా నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయటపడిందన్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారి వడ్డె రోహిత్కుమార్ (27),తో పాటు మరో ముగ్గురు వడ్లమూరి శ్రీనివాసరావు (25), సిరిసాల లక్ష్మీ (30), గారెపల్లి సాయి ప్రణయ్ (25) నిందితులను అరెస్ట్ చేశామని మహేష్ భగవత్ తెలిపారు. కాకతీయ వర్సిటీ, జేఎన్టీయూ, ఆచార్య నాగార్జున వర్సిటీల నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తున్నట్లు వివరించారు.
రోహిత్ అనే వ్యక్తి ఐటీ ఉద్యోగం చేస్తున్నాడని, ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేసి డబ్బులు దండుకుంటున్నల్లు వెల్లడించారు. శ్రీలక్ష్మీ కన్సల్టెంట్స్ ద్వారా ఈ దందా కొనసాగిస్తున్నారన్నారు. ఒక్కో సర్టిఫికెట్ రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. విదేశాలకు వెళ్లే వారు ఎక్కువగా ఈ సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారని అన్నారు. ఇప్పటి వరకు 20 వరకు నకిలీ సర్టిఫికెట్స్ విక్రయించినట్లు తెలిసిందన్నారు. గత ఆరు నెలల నుండి నకిలీ ఈ దందా చేస్తున్నారన్నారు. నిందితుల వద్ద నుండి 106 నకిలీ సర్టిఫికెట్స్, 2 ల్యాప్టాప్స్, ఒక ప్రింటర్, 4మొబైల్ ఫోన్లు, రెండు ఫేక్ రబ్బర్ స్టాంప్స్, 30 నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు.