పండు కోసం ఆశపడితే.. పశువును కట్టినట్టు కట్టేసి ఎండలో నిలబెట్టారు

పండు కోసం ఆశపడ్డ పదేళ్ల బాలికను పశువులను కట్టేసే గొలుసుతో బంధించి ఎండలో నిలబెట్టిన తోట యజమానుల ఉదంతమిది.

Update: 2023-05-07 12:10 GMT

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: పండు కోసం ఆశపడ్డ పదేళ్ల బాలికను పశువులను కట్టేసే గొలుసుతో బంధించి ఎండలో నిలబెట్టిన తోట యజమానుల ఉదంతమిది. అమానవీయమైన ఈ సంఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం విఠలాపురం గ్రామంలో జరిగింది. స్థానికంగా ఉంటున్న ఓ గొర్రెల కాపరి పదేళ్ల కూతురు బత్తాయి పండు కోసం గ్రామంలోని ఓ తోటకు వెళ్లింది. ఆ చిన్నారి లోపలికి రావటం చూసి తోట యజమానులైన భార్యాభర్తలు పట్టుకున్నారు. పసిపాప అని కూడా చూడకుండా కొట్టారు.

ఆ తర్వాత పశువులను కట్టేసే గొలుసుతో రెండు చేతులను బంధించారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన చిన్నారి తండ్రి తన కూతురి మానసిక స్థితి సరిగ్గా లేదని, విడిచి పెట్టండని కన్నీళ్లతో ప్రాధేయపడ్డా తోట యజమానుల మనసు కరగలేదు. చిన్నారి దళిత బాలిక అయినందునే తోట యజమానులు ఇలా ప్రవర్తించారని గ్రామస్తులు ఆరోపించారు. పసిపాప అని కూడా చూడకుండా అగ్రవర్ణ అహంకారంతో ఇలా ప్రవర్తించిన తోట యజమానులపై సూమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను, జిల్లా కలెక్టర్‌ను కోరారు.

Tags:    

Similar News