మహిళతో అక్రమ సంబంధం.. ఆ తరువాత దారుణ హత్య.. ఏం జరిగిందంటే..

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం దారుణం జరిగింది.

Update: 2023-05-06 09:53 GMT

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం దారుణం జరిగింది.  మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి  ఆమెను మిట్ట మధ్యాహ్నం కత్తితో అతి దారుణంగా పొడిచి హత్య చేసిన సంఘటన  సంచలనం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడూరు మండలం చర్ల ఇటిక్యాల గ్రామానికి చెందిన ఎల్లమ్మ (30) వివాహం అనంతరం భర్తకు దూరంగా ఉంది. ఈ క్రమంలో ఎల్లమ్మకు తుమ్మలసుగూర్ గ్రామానికి చెందిన బాలకృష్ణతో గత ఏడాదిగా పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారి తీసింది.

కాగా  ఇటీవల ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగా బాలకృష్ణ ఎల్లమ్మపై  కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం నెల్లికొండ చౌరస్తాలో  ఎల్లమ్మ తన తల్లితోపాటు నడుచుకుంటూ వెళ్తుండగా  బాలకృష్ణ వెనుక నుంచి  వెళ్లి కత్తితో ఆమెను మూడు బలమైన పోట్లు పొడిచాడు. దీంతో రక్తపు మడుగులో ఎల్లమ్మ కుప్పకూలింది. వెంటనే 108 సాయంతో జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎల్లమ్మ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News